నోటుకు ఓటు కేసు: కెసిఆర్ మీద చంద్రబాబు పైచేయి?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మీద పైచేయి సాధించారనే మాట వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాయకుల వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ న్యాయం తమ తరఫున ఉందని అన్నవారు కూడా ఉన్నారు.
రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం మాట అటుంచితే నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఎసిబి ప్రగతి సాధించిన సూచనలు కనిపించడం లేదు. కేసు తొలి దశలో చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపించారు. కానీ, ప్రస్తుతం పైచేయి సాధించినట్లు కనిపిస్తున్నారు. దానికితోడు, తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్ వేసిన పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేస్తూ ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని ఆదేశించడం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
నోటుకు ఓటు కేసులో నాలుగో నిందితుడు మత్తయ్యను అరెస్టు చేయకూడదని ఆదేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా ఎసిబికి ఇబ్బందిగానే ఉంది. మత్తయ్య దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్పై విచారణ జరుపుతున్న కోర్టు మత్తయ్య అరెస్టుపై స్టే విధించింది.
మరోవైపు, తెలంగాణ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ఎసిబి విచారణకు డుమ్మా కొట్టడంపై ఎసిబి ముందుకు వెళ్లినట్లు కనిపించడం లేదు. ఎసిబి ఇచ్చిన నోటీసులను ఆయన దాదాపుగా ఖాతరు చేయలేదనే చెప్పాలి. ఆడియో, వీడియో టేపులపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక వచ్చిన తర్వాత ఎసిబి దూకుడుగా వ్యవహరిస్తుందని భావించారు. కానీ అది ముందుకు సాగకపోగా, రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం, మత్తయ్యకు అరెస్టు నుంచి మినహాయింపు లభించడం, సండ్ర వెంకట వీరయ్య విచారణకు హాజరు కాకపోవడం వంటి ఆటంకాలను ఎసిబి ఎదుర్కుంటోంది. ఆ విషయాలన్నింటిలో చంద్రబాబు వ్యూహం ఫలించందనే మాట వినిపిస్తోంది.