కీలక మలుపు: డిలీట్ మెసేజ్లు కీలకం, బాబుకు నోటీసు తప్పదా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరగనుంది. ఫోరెన్సిక్ తుది నివేదిక కోర్టుకు చేరింది. తుది కాపీ కోసం ఏసీబీ... కోర్టులో మెమో దాఖలు చేసింది. వాటి ఆధారంగా నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. రేవంత్, సెబాస్టియన్ ఫోన్లలో డిలీట్ మెసేజ్లను రికవరీ చేశారు.
కేసులో కీలకమైన రేవంత్ వీడియా, చంద్రబాబుదిగా భావిస్తున్న ఆడియో రికార్టులతో పాటు నిందితులు వాడిన సెల్ఫోన్లు, పెన్డ్రైవ్లు, హార్డ్డిస్క్లు తదితర పరికరాల పరీక్షలు పూర్తి చేసిన ఎఫ్ఎస్ఎల్ తుది నివేదికను కోర్టుకు సమర్పించింది.
కోర్టు నుంచి నివేదిక అందగానే అందులోని వాయిస్ చంద్రబాబుదేనా.. అని ధృవీకరించేందుకు వాయిస్ రీకాల్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని, ఇందుకోసం బాబుకు నోటీసులు జారీ చేస్తామని ఏసీబీ అధికారి ఒకరు తెలిపారని నమస్తే తెలంగాణ పేర్కొంది.
అయితే నేరుగా నోటీసులు పంపించడమా లేక కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడమా అనేది ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రేవంత్ తదితర నిందితుల ఫోన్లలో డిలిట్ చేసిన మెసేజ్లను మెమొరీ నుంచి సేకరించారని, ఇవి కేసులో కుట్రకోణాన్ని ఛేదించేందుకు ఉపయోగపడతాయని అంటున్నారు.
రేవంత్, సెబాస్టియన్ ఫోన్లలో డిలిట్ అయిన మెసేజ్లపై ఎఫ్ఎస్ఎల్ కీలకమైన ఆధారాలను సంపాదించినట్టు తెలుస్తోంది. రేవంత్ ఫోన్లో డిలీట్ అయిన మెసేజ్లను సైతం రికవరీ చేశారు. పూర్తిస్థాయిలో నివేదికలో ఫోరెన్సిక్ అధికారులు పొందుపరిచినట్టు తెలిసింది. ఈ మెసేజ్లు అతికీలకంగా మారబోతున్నాయని అంటున్నారు.
కాగా, రేవంత్ జరిపిన ప్రతి సంభాషణను ఎఫ్ఎస్ఎల్ నిశితంగా పరిశీలించి లిఖిత పూర్వకంగా నివేదికను రూపొందించిందని తెలుస్తోంది. రేవంత్, స్టీఫెన్సన్, సెబాస్టియన్ సాగించిన సంభాషణలను ఫొటోలతో సహా వివరాలను నివేదికలో పొందుపరిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫొటో పక్కన క్యాప్షన్ పేరుతో ప్రతి క్షణం సంఘటనలను నిమిషాలతో సహా వివరిస్తూ నివేదిక రూపొందిచినట్టు తెలుస్తోంది.
ఎఫ్ఎస్ఎల్ నివేదిక తమకు అందగానే చంద్రబాబు వాయిస్ రీకాల్కు తాము సిద్ధంగా ఉన్నామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కోర్టు నుంచి ఫోరెన్సిక్ నివేదిక పొందిన తర్వాత ముందుకెళ్లే అవకాశాలున్నాయి.
ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన నివేదికలోనూ వాయిస్ రీకాల్ అంశం ఉండే అవకాశం ఉందని, స్టీఫెన్ సన్ ఫోన్లో ఉన్న చంద్రబాబు ఆడియోను మరోసారి పరిశీలించి తేల్చేందుకు వాయిస్ రీకాల్ అవసరమని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. దీనికి తాము కోర్టు ద్వారా అనుమతితీసుకోవడమా? లేక నేరుగా చంద్రబాబు, ఇతరులకు నోటీసులుజారీ చేసి ఆడియో రీకాల్ పిలవడమా? అన్నది న్యాయసలహాపై ఆధారపడి ఉంటుందంటున్నారు.