జగన్ రావాలి: సీబీఐ కోర్టు, ఇవాల్టికి మినహాయింపు, 29కి వాయిదా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం సీబీఐ కోర్టులో ఆస్తుల కేసు విచారణ జరిగింది. విజయ సాయి రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ, గీతా రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు.
జగన్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో సీబీఐ కోర్టు ఆయన కోర్టుకు హాజరు కావాల్సిందేనని చెప్పింది. ఇటీవలె సీబీఐ 11వ చార్జీషీటులో జగన్కు సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ చేసిన తొలిసారి కోర్టుకు హాజరు కావాలి న్యాయస్థానం జగన్ తరఫు న్యాయవాదులకు తెలిపింది.
దీంతో జగన్ న్యాయవాదులు గంట వాయిదా కోరారు. జగన్ ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ తరఫు న్యాయవాదులు ఆ తర్వాత ఈ రోజు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వారి విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. ఈ నేపథ్యంలో జగన్ ఈ నెల 29న కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్కు సీబీఐ డాక్యుమెంట్లు ఇచ్చే ముందు తమకు చెప్పాలని జగన్ తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. కాగా, ఆస్తుల కేసులో కోర్టుకు హాజరైన వారిలో జగన్ బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా కోర్టుకు హాజరయ్యారు.