చిక్కుల్లో జగన్ పార్టీ నేత బౌలశౌరి: సిబిఐ కేసు నమోదు
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బాలశౌరి చిక్కుల్లో పడ్డారు. ఆయనపైన, ఇండియన్ ఎయిర్ఫోర్స్ మాజీ ఉద్యోగి పోలు శ్రీధర్పైన సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. వచ్చే వారంలో సీబీఐ అధికారులు బాలశౌరిని విచారించే అవకాశం ఉందని అంటున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ మాజీ ఉద్యోగి పోలు శ్రీధర్ను ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసింది. 2007 జనవరి 1 నుంచి 2012 డిసెంబరు 31 మధ్య కాలంలో పోలు శ్రీధర్ తన ఆదాయానికి మించి రూ.11.96 కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ ఆయనపై చార్జిషీట్ దాఖలు చేసింది.
మీడియా కథనాల ప్రకారం - కేసు విచారణలో భాగంగా గుంటూరు, హైదరాబాద్, నోయిడాల్లో సీబీఐ విస్తృతంగా సోదాలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా జరిపిన విచారణలో బాలశౌరి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన సొంత బ్యాంకు ఖాతా నుంచి శ్రీధర్ యాక్సిస్ బ్యాంక్ ఖాతాకు పెద్ద ఎత్తున నగదు బదిలీ అయినట్లు గుర్తించింది.
అయితే, బాలశౌరి కోసం స్థలం కొనుగోలు చేసేందుకే ఆయన తన బ్యాంకు ఖాతాకు అంత పెద్ద మొత్తం పంపారే తప్ప అది తన సొంత డబ్బు కాదని, ఆదాయానికి మించి అక్రమ సంపాదన ఒక్క పైసా కూడా తన వద్ద లేదని శ్రీధర్ సీబీఐ విచారణలో వెల్లడించారు. దీంతో బాలశౌరిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.
ఢిల్లీకి సమీపంలోని నజ్ఫగడ్ ప్రాంతంలో 2007-08 సంవత్సరంలో బాలశౌరి 20 ఎకరాల స్థలాన్ని రూ.12.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ స్థలం కొనుగోలులో బాలశౌరికి, రైతులకు మధ్యవర్తిగా శ్రీధర్ వ్యవహరించారని సమాచారం. రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని శ్రీధర్ ఖాతాకు తరలించారు.
అందులో భాగంగా నజ్ఫగడ్లోని యాక్సిస్ బ్యాంకులోని శ్రీధర్ ఖాతాలోకి ఒకసారి రూ.8.4 కోట్లు, బెంగళూరులో అదే బ్యాంకులో ఉన్న శ్రీధర్ ఖాతాలో ఒకసారి రూ.1.2 కోట్లు, మరోసారి రూ.2.3 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇంత భారీస్థాయిలో లావాదేవీలు గుట్టుచప్పుడు కాకుండా జరగడానికి నజ్ఫగడ్ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మనీశ్ సక్సేనా సహకరించారని సీబీఐ గుర్తించింది.
శ్రీధర్ పేరుతో నకిలీ ఖాతాలు తెరచి కోట్ల రూపాయల లావాదేవీలు నడిచేందుకు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని సహకరించారనే ఆరోపణలతో సక్సేనాపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, ఆయన్ను అరెస్ట్ చేసింది. వచ్చే వారంలో బాలశౌరిని పిలిచి విచారించే అవకాశం ఉందని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారని ఓ పత్రిక రాసింది. అయితే తాను భూమిని చట్టబద్దంగానే కొనుగోలు చేశానని బాలశౌరి చెబుతున్నట్లు తెలుస్తోంది.