తెలంగాణ వాటర్ గ్రిడ్పై కేంద్రం ప్రశంసలు: కెసిఆర్ ఖుషీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచిత మంచి నీరందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. తెలంగాణ రాష్ర్టాన్ని మార్గనిర్ధేశకంగా తీసుకుని మిగతా రాష్ర్టాలు కూడా ఈ పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. దానికి కెసిఆర్ ఖుషీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాటర్గ్రిడ్ పథకాన్ని కేంద్రం ప్రశంసించడం ఆనందంగా ఉందని కెసిఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి నీరందించటమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన వాటర్గ్రిడ్ పథకం ఇతరులకు ఆదర్శంగా నిలువడం సంతోషించదగ్గ అంశమని అన్నారు. వాటర్గ్రిడ్ను సకాలంలో పూర్తి చేసి ఇతర రాష్ర్టాలకు మార్గనిర్ధేశం చేయాలని అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు.
పేద రోగులపై అధిక భారం పడకుండా వైద్య సేవలు అందించాలని కెసిఆర్ తనను కలిసిన వైద్య బృందానికి సూచించారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ కృష్ణా రెడ్డి తదితర ప్రముఖ వైద్యులు మంగళవారంనాడు కెసిఆర్ను కలిశారు.
హైదరాబాదును హెల్త్ హబ్గా మార్చాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. స్టెంట్ సహా ముఖ్యమైన వైద్యపరికరాలు తెలంగాణలోనే తయారు చేసుకునే విధంగా ఎదగాలని ఆయన అన్నారు. నిష్ణాతులతో ఆరోగ్య సలహా మండలిని ఏర్పాటు చేస్తామని కెసిఆర్ చెప్పారు.