ఆర్థిక అవసరాలు: ఏపీకి రూ.700 కోట్లు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రూ.700 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలకు లోబడి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. కాగా, మంగళవారం ఈ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరింది.
వరద సాయం కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖకు స్పందించిన కేంద్రం తక్షణం రూ.940 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతకు ఒక్కరోజు ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్రానికి తక్షణం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు.
దీనిపై స్పందించకుండా తమిళనాడు లేఖకు తక్షణం ప్రతిస్పందించిందన్న విమర్శలు రావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకొంది. కేంద్ర ప్రణాళిక పథకాల కింద ఏపీకి రూ.700 కోట్లు విడుదల చేసింది.
2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రకృతి వైపరీత్య పరిహార నిధి కింద ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే రూ.330 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పుడు దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటు కోసం రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.