టీటీడీపై బీజేపీకి బాబు షాక్, దర్శకేంద్రుడికి చోటు
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చదలవాడ కృష్ణమూర్తిని అధ్యక్షుడిగా నియమించింది. ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, పిల్లి అనంత లక్ష్మి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, తెలంగాణకు చెందిన సండ్ర వెంకటవీరయ్య, జి సాయన్నలకు సభ్యులుగా అవకాశమిచ్చారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారికి అవకాశమిచ్చారు.
ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 మందికి స్థానం లభించింది. మండలి పదవి కాలం ఏడాదిగా పేర్కొన్నారు. దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్య రావు (బిజెపి) చేసిన సిఫార్సులను పక్కకుపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెదేపాకు పెద్దపీట వేసినట్లుగా తెలుస్తోంది. కృష్ణమూర్తి చైర్మన్గా, మరో 14మంది అనధికారులను సభ్యులుగా నియమించారు.
దేవాదాయ, ధర్మాదాయ చట్టం ప్రకారం మరో ముగ్గురు ఐఏఎస్లు సభ్యులుగా ఉంటారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, తిరుపతికి చెందిన బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ పేర్లను మాణిక్యరావు టీటీడీ సభ్యులుగా సిఫార్సు చేశారని సమాచారం.
బోర్డు ఏర్పాటుకు మాణిక్య రావు నుంచి వెళ్లిన ఫైల్ను దాదాపు పదిహేను రోజులపాటు పక్కకు పెట్టిన చంద్రబాబు, 15మంది అనధికారులు, ముగ్గురు అధికారులతో కూడిన జాబితాకు అంగీకారం తెలిపారని అంటున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో చివరిక్షణంలో తిరుపతి ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ టిక్కెట్ దక్కని చదలవాడ కృష్ణమూర్తిని చైర్మన్గా నియమించారు.
అలాగే ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, కాకినాడ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కొండపి ఎమ్మెల్యే డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, సత్తుపల్లి ఎమ్మెల్యే (ఖమ్మం) సండ్ర వెంకట వీరయ్య, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులకు పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించారు.
టీడీపీలో చాలాకాలంగా సేవలందిస్తూ, చంద్రబాబుకు నమ్మినబంటుగా పేరు తెచ్చుకున్న ఏవీ రమణకు సభ్యుడిగా అవకాశమిచ్చారు. అలాగే ఎల్లా వెంకటేశ్వర రావుకు బంధువుగా భావిస్తున్న ఎల్లా సుచిత్రతోపాటు, తమిళనాడు, కర్నాటకలకు చెందిన వీ కృష్ణమూర్తి, డీపీ అనంత, జే శేఖర్, పీ హరిప్రసాద్, మహారాష్ట్రకు చెందిన సంపత్ రావి నారాయణతోపాటు ప్రముఖ సినీ దర్శకుడు కే రాఘవేంద్ర రావుకు సభ్యులుగా అవకాశం కల్పించారు.