షాక్: దేవరపల్లి భూములపై దిగొచ్చిన చంద్రబాబు సర్కార్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఆందోళనకు దిగడంతోపాటు కేంద్రం వరకు సమస్య తీవ్రతను తీసుకెళ్లడంతో అధికార తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది.
హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లా పర్చూర్ మండలం దేవరపల్లి గ్రామంలో దళితుల భూముల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఆందోళనకు దిగడంతోపాటు కేంద్రం వరకు సమస్య తీవ్రతను తీసుకెళ్లడంతో అధికార తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది.
తొలుత ఈ భూములు సర్కార్వేనన్న జిల్లా రెవెన్యూ అధికారి పేర్కొన్నారు. ఆ తర్వాత సదరు భూములను తెలుగు తమ్ముళ్లు స్వాధీనం చేసుకుని' నీరు-చెట్టు' పథకం కింద చెరువు తవ్వుతామని బుకాయింపులకు దిగారు. కానీ ఆందోళన, కేంద్రం వరకు సమస్య వెళ్లడంతో విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబు సర్కారు వెనకడుగు వేసింది.
దేవరపల్లిలో పర్యటించిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్బాబు మాట్లాడుతూ దళితులకే ఈ భూములు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. తవ్వకాలు చేపట్టిన భూములను రెవెన్యూ అధికారులు చదును చేసి ఇస్తారని కూడా ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా దేవరపల్లి ఘటన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును పూర్తిగా ఆత్మరక్షణలో పడవేసింది.
ఇలా ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు
పర్చూరు మండలం దేవరపల్లి గ్రామంలో 22 ఎకరాల భూమి దశాబ్దాలుగా దళితుల స్వాధీనంలో ఉంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తాగునీటి అవసరాల కోసం చెరువు తవ్వకమంటూ ఆ భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు డీఆర్ఓ మొదలు స్థానిక రెవెన్యూ అధికారులు సహకారం అందించారు. ఎమ్మెల్యే అనుచరులు దళితుల భూములను లాక్కునేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీ నేతల ఆగడాలను దేవరపల్లి దళితులు ప్రతిఘటించారు. పోలీసులను అడ్డుపెట్టి అక్రమ నిర్భంధాలు కొనసాగించినా వారు వెనక్కి తగ్గలేదు. తొలుత వామపక్షాలు దళితులకు అండగా నిలిచి దళితుల భూములు వారికే ఉంచాలని ఆందోళన చేపట్టాయి. ఆ భూములు ప్రభుత్వానివేనని దళితుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అధికార పార్టీ నేతలు వాటిల్లో అడ్డగోలు తవ్వకాలు చేపట్టారు.
75 రోజుల నిరంతర పోరుతో దళితుల విజయం
దేవరపల్లిలో దళితులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నం ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిఘటన ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలు, దళితులు, ప్రజలు భాగస్వాములయ్యారు. అధికార తెలుగుదేశం పార్టీ ఆధిపత్య, ప్రభుత్వ అధికారుల నిరంకుశ విధానానికి ఎదురునిలిచారు. రెండు నెలలపాటు దేవరపల్లి దళితులను మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా ప్రభుత్వం దెబ్బ తిన్నది. దేవరపల్లిలో దళితుల భూముల ఆక్రమణను వ్యతిరేకిస్తూ గత నెల 16వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. దేవరపల్లిని సందర్శించేందుకు సిద్ధమైన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ ముందు రోజు రాత్రి నుంచే పోలీసులు ఒంగోలులోని ఆయన సొంతింట్లో గృహనిర్భంధం చేశారు. జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో పాటు వామపక్షాల నేతలను నిర్భంధించటంతో పాటు కొందరిని పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత రాత్రంతా 18 మిషన్లు పెట్టి దళితుల భూముల్లో దౌర్జన్యంగా కట్టలు పోశారు. జిల్లా రెవెన్యూ అధికారితో పాటు స్థానిక అధికారులు ఇందుకు సహకరించారు.
Recommended Video
ఇలా దేవరపల్లి విషయమై వెనక్కు తగ్గిన ఏపీ సర్కార్
ఆ తర్వాత 20వ తేదీన వైఎస్సార్సీపీ నేతలు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జునలతో పాటు నేతలు, కార్యకర్తలు దేవరపల్లికి చేరుకున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ దౌర్జన్యంగా ఆక్రమించుకున్న దళితులను భూములను సందర్శించారు. దళితుల భూములు వారికి ఇప్పించే వరకు పోరాటం సాగిస్తామని హామీ ఇచ్చారు. సమస్యను రాష్ట్ర స్థాయితో పాటు ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు జరిగిన ఘటనను వివరించారు. దేవరపల్లి ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తిన వరకు తీసుకెళ్లడంతో చంద్రబాబు సర్కార్ వెనక్కి తగ్గింది. దళితులకు అన్యాయం జరగనివ్వబోమని పది రోజుల తర్వాత అధికార పార్టీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కారు. మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు మరికొందరు నేతలను దేవరపల్లికి పంపారు. ఏది ఏమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు పోరాటంతోనే తమకు భూములు దక్కాయని దేవరపల్లి దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి చెంపపెట్టు అన్న బాలినేని
దేవరపల్లి దళితుల సమస్య ఢిల్లీ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. అధికార పార్టీ దౌర్జన్యాలను ఆయనకు వివరించామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరుకు దిగడంతో చంద్రబాబు సర్కారుకు బుద్ధి వచ్చిందన్నారు. వామపక్షాలు దళితుల పక్షాన నిలిచి పోరాటం చేశాయన్నారు. వెంటనే ప్రభుత్వం తవ్వకాలు చేపట్టిన కట్టలను పూర్తిగా చదును చేసి దళితుల భూములు వారికి అప్పగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారన్న అక్కసుతోనే దేవరపల్లి దళితుల భూములను స్థానిక అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. చెరువు పేరుతో దళితులను నిరాశ్రయులను చేసి భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారన్నారు. అధికారులు కూడా ఇందుకు వత్తాసు పలికారని చెప్పారు.దళితులకు భూములు పూర్తిగా స్వాధీనం చేసే వరకు అండగా నిలబడతాం అని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
2014 నుంచి భూముల కబ్జాకు ఇలా యత్నం
ప్రకాశం జిల్లాలో 70 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూములపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది. ఇప్పటికే గ్రామంలో రెండు చెరువులు అందుబాటులో ఉన్నా అవి చాలవంటూ దళితులు పండిస్తున్న పొల్లాల్లో యంత్రాలు మోహరించి మరో చెరువు తవ్వేందుకు సిద్ధపడ్డారు. నిండా 600 కుటుంబాలు కూడా లేని ఓ గ్రామంలో.. అదీ పేదలు దశాబ్దాలుగా నమ్ముకున్న భూముల్లో చెరువుల తవ్వకానికి పూనుకున్నారు. పర్చూరు మండలం దేవరపల్లిలో సర్వే నం.159/1లోని 22 ఎకరాల భూములు గ్రామానికి చెందిన 40 దళిత కుటుంబాల స్వాధీనంలో ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో స్థానిక అధికార పార్టీ నేతలు ఆ భూములను లాక్కునేందుకు పలుమార్లు ప్రయత్నించారు.
నేతల అరెస్ట్.. మీడియాకు నో పర్మిషన్
జేసీబీలు, ఇటాచీలు మోహరించి పోలీస్ బలగాల పహరాలో కుంట తవ్వకం ప్రారంభించారు. ముందు దేవరపల్లి దళితవాడపై పోలీస్ బలగాలు విరుచుకుపడ్డాయి. పడుకున్న వారిని పడుకున్నట్లే అరెస్ట్ చేసి లాక్కెళ్లి పోలీస్స్టేషన్లలో పడేశారు. ఆ తర్వాత 400 మంది పోలీసుల సిబ్బంది పహారా మధ్య భారీగా యంత్రాలను తరలించి దౌర్జన్యంగా ‘నీరు-చెట్టు' పథకం కింద కుంట తవ్వకం ప్రారంభించారు. ఈ సంగతి తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నేతలు దళితులకు మద్దతుగా దేవరపల్లికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్స్టేషన్లకు తరలించారు. మీడియాను సైతం చెరువు తవ్వకం వద్దకు అనుమతించలేదు. పర్చూరు నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 100 మందికిపైగా నేతలను వివిధ పోలీస్స్టేషన్లలో నిర్భంధించారు.
ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అన్న దళితులు
ఇప్పటికే గ్రామంలో ఉన్న రెండు చెరువుల్లో నీరు నింపితే 600 కుటుంబాల్లోపు ఉన్న దేవరపల్లి వాసుల అవసరాలకు సరిపోతుంది. దళితుల భూములు లాక్కోవాల్సిన అవసరమే లేదు. గ్రామంలో 12 ఎకరాల పరిధిలో ఓ చెరువు ఉంది. 5 ఎకరాల 37 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న చెరువు నీటిని గ్రామంలోని అన్ని వర్గాల వారు గృహాలు, ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు. దేవరపల్లి పరిధిలోనే అధికార టీడీపీ నేతలు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నా అధికారులు వాటి జోలికి వెళ్లలేదు. 70 ఏళ్లుగా దళితులు నమ్ముకున్న పొలాన్ని లాక్కున్ని కుంట తవ్వాలనుకోవడం కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనం అని స్థానిక దళితులు అభిప్రాయ పడ్డారు. తమపై చంద్రబాబు సర్కారు కక్ష కట్టిందని దళితులు వాపోయారు. 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని ఎక్కడకు తీసుకెళ్లారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నామని బోరుమన్నారు. తమకు ఎవరూ మాకు సాయం చేయలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించామని దళితులు అన్నారు.మరోవైపు పోలీసులు దేవరపల్లిలో ఆంక్షలు అమలు చేశారు. గ్రామంలో చెక్పోస్టులు పెట్టారు. మీడియా ప్రతినిధులను గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పర్చూరు నియోజకవర్గంలో టీవీ ప్రసారాలు కూడా నిలిపివేశారు.