పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు: వీర్రాజు లక్కీ?
హైదరాబాద్: రాజధాని కోసం తలపెట్టిన భూసేకరణపై దీక్ష చేస్తానని హెచ్చరించిన జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడైన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించడంలో అదే రాజకీయం ఉందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకూడదని తొలుత నిర్ణయించుకున్న చంద్రబాబు ఆ తర్వాత మనసు మార్చుకుని, బిజెపికి ఒక్క సీటు ఇవ్వడానికి అంగీకరించారని, ఆ తర్వాత ఆ సీటు కూడా బిజెపి పవన్ కళ్యాణ్కు సన్నిహితుడైన సోము వీర్రాజుకు దక్కేలా చేశారని అంటున్నారు.
రాయలసీమ నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పటికీ ఎమ్మెల్సీ అభ్యర్థి బిజెపి సోము వీర్రాజు పేరును ప్రకటించింది. కాపు నాయకుడైన వీర్రాజు పేరును ప్రకటించడం పట్ల రాయలసీమ బిజెపి నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీర్రాజుకు టికెట్ దక్కేలా చంద్రబాబు ప్రయత్నాలు సాగించి, విజయం సాధించారని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు ఇటీవల రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు బిజెపి సీనియర్ నేతలను ఆయన కలుసుకున్నారు. బిజెపికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పారు. తమ సొంత పార్టీ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైనప్పటికీ వీర్రాజుకు టికెట్ రావడంలో చంద్రబాబు కీలకమైన పాత్ర పోషించారని అంటున్నారు.
రాజధాని భూసేకరణపై పవన్ కళ్యాణ్ రోడ్డు మీదికి వస్తారనే ఆందోళనకు గురైన చంద్రబాబు వీర్రాజుకు సీటు దక్కేలా చేశారని, దాంతో పవన్ కళ్యాణ్ తమపై వ్యతిరేకంగా వ్యవహరించబోరని టిడిపి నాయకులు నమ్ముతున్నారు.