బాబు బిగ్ ప్లాన్: ఆ మచ్చను తొలగించేందుకు ఇదిగో ప్రణాళిక!..
ఎరువులు-విత్తనాల కోసం అన్నదాతలు గంటల తరబడి కౌంటర్ ల వద్ద ఎదురుచూసే పరిస్థితి లేకుండా.
హైదరాబాద్: హైటెక్ సీఎంగా ముద్రపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి రైతు వ్యతిరేకి అన్న ముద్ర జనంలో నాటుకుపోయింది. వ్యవసాయం దండగా అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను జనం ఇప్పటికీ మరిచిపోలేరు. ఇక ప్రతిపక్షాలు సైతం సందర్భం వచ్చిన ప్రతీసారి.. బాబు గారి రైతు ప్రేమను చీల్చి చెండాడుతూనే ఉంటాయి.
అయితే రైతు వ్యతిరేకి అన్న ముద్ర నుంచి బయటపడటానికి చంద్రబాబు కొత్త ప్లాన్ వేసినట్లుగా చెబుతున్నారు. రైతులను ఆకర్షించడం కోసం, తనపై ఉన్న వ్యతిరేకతను తొలగించడం కోసం తాజాగా ఆయన ఓ నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇకనుంచి రైతుల సంక్షేమం కోసం చంద్రన్న అగ్రి సెంటర్లను ప్రారంభించాలనే యోచనలో ఉన్నారట.
రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించే కేంద్రాలుగా ఈ అగ్రి సెంటర్లు పనిచేస్తాయట. ఇక్కడకు వచ్చే రైతులకు.. టెక్నాలజీ సహాయంతో.. సాగు భూమి వివరాలు, ఏ కాలంలో ఏ పంట వేయాలి?, నీటి వనరుల లభ్యత, ఎరువులు-విత్తనాల వివరాలన్ని అక్కడి అధికారులు వివరిస్తారట. ఇన్ పుట్ సబ్సిడీ వంటి సమాచారాన్ని కూడా ఈ కేంద్రాల ద్వారా రైతులకు చేరవేస్తారట.
ఎరువులు-విత్తనాల కోసం అన్నదాతలు గంటల తరబడి కౌంటర్ ల వద్ద ఎదురుచూసే పరిస్థితి లేకుండా.. నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేసే విధానం కూడా ఈ అగ్రి సెంటర్ ప్రణాళికలో ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ అగ్రి సెంటర్లు కార్యరూపం దాల్చేందుకు చంద్రబాబు చర్యలు తీసుకోనున్నారట. చూడాలి మరి.. అగ్రి సెంటర్లు చంద్రబాబు రైతు వ్యతిరేకి ముద్రను ఎంతవరకు తుడిచిపెడుతాయో!