కెసిఆర్కు బాబు సవాల్: మాటలు బాధ కలిగించాయని వ్యాఖ్య
హైదరాబాద్: సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అదే బలమని భ్రమపడుతున్నారని, చేతనైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును సవాల్ చేశారు. ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని, తాము సిద్ధంగా ఉన్నామని, కెసిఆర్ సిద్ధమో కాదో తేల్చుకోవాలని ఆయన అన్నారు.
రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సోమవారం రాత్రి దాదాపు తొమ్మిది గంటలకు ఎన్టీఆర్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు, టీఆర్ఎస్ 14వ వార్షికోత్సవ బహిరంగ సభ సందర్భంగా కేసీఆర్ చేసిన విమర్శలకు ఈ సందర్భంగా ఆయన జవాబిచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
ఇదే ఎన్టీఆర్ భవన్లో కూర్చుని కార్యకర్తలకు తెలుగుదేశం పాఠాలు చెప్పిన కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు బయటకు వెళ్లి తిట్ల పురాణం విప్పుతున్నారని, ఏదేదో మాట్లాడుతున్నారని, తన దగ్గర పని చేసి, ట్రస్ట్ భవన్లో పాఠాలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు నీకిక్కడేం పని అని అంటున్నారని, వారి మాటలు మనసుకు బాధ కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రజలతో కార్యకర్తలతో తనకు ఉన్న సంబంధాన్ని ఎవరూ విడదీయలేరని చంద్రబాబు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు బాధ కలిగేలా ఉన్నాయని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తాను ఇక్కడ ఉన్నానని, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని తీరతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయేనని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి అంతా టీడీపీ పుణ్యమేనని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.
గుజరాత్ తర్వాత తెలంగాణే మిగులు బడ్జెట్ రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం ప్రకటించిందని, దీనికి కారణం టీడీపీ ప్రభుత్వమేని చెప్పారు. తాము రక్షించిన సంపదను వైఎస్ హయాంలో తెగనమ్ముకుని రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు.
చేసింది చెబుదామని, ప్రజల్లోకి వెళదామని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దామని, టీడీపీకి పేద, బడుగు, బలహీన వర్గాలు, ప్రజల మద్దతు ఉందని, వారి మద్దతు ఉన్నంత వరకూ భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడి, వారి మద్దతు కూడగట్టుకుని బుల్లెట్లా దూసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ జెండాను రెపరెపలాడించి 2019 నాటికి అధికారాన్ని సాధించేవరకు ఉడుంపట్టు పట్టాలని సూచించారు.
పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి వారిని ఎన్నికల్లో గెలిపించుకుంటే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని టీ టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ చేశారు.