జగన్కు ధీటుగా చంద్రబాబు: వ్యక్తిగత దూషణలంటూ జగన్ ఫైర్
హైదరాబాద్: హుధుద్ తుఫాను బాధితులకు అందించిన సహాయంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేసిన విమర్ళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీటుగా ప్రతిస్పందించారు. సహాయక చర్యలు ప్రజల కోసం చేశాం గానీ ప్రతిపక్షాల కోసం చేయలేదని ఆయన అన్నారు. ఏదో విమర్శ చేయాలి కాబట్టి ప్రతిపక్షం విమర్శ చేస్తోందని ఆయన అన్నారు. హుధుద్ తుఫానుపై శానససభలో శనివారం జరిగిన చర్చలో భాగంగా చంద్రబాబు మాట్లాడారు.
హుధుద్ తుఫాను రావడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. తుఫాను ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రబావం చూపిందని ఆయన అన్నారు. పెను తుఫానును ఎదుర్కునేందుకు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల నష్టం తగ్గిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏం చేయవచ్చునో అవన్నీ చేశామని చెప్పారు. నిరంతర పర్యవేక్షణలో తుఫాను నష్టాన్ని తగ్గించగలిగామని ఆయన అన్నారు.
తుఫాను సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తుఫానుపై వేగంగా ప్రతిస్పందించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకున్న ఘనత తమ తెలుగుదేశం పార్టీదేనని అని ఆయన అన్నారు. మధ్యవర్తులు లేకుండా సాయం అందించామని ఆయన చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అధికార పార్టీ సభ్యుడు కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యల్ని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తప్పుబట్టారు. మిడిమిడి జ్ఞానంతో సభ్యుడు మాట్లాడుతున్నారని ఆయన శనివారం అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం తెలిపారు. హుధుద్ తుపాను చర్చల్లోనూ టీడీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల కాలంలో కరవుతో అల్లాడిపోయిన ప్రజలకు 2004లో వైఎస్ఆర్ సీఎం అయ్యాక కేంద్రం నుంచి బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ తీసుకొచ్చారని గుర్తు చేశారు.
ఎప్పుడూలేని రీతిలో రైతులకు వడ్డీని మాఫీ చేసిన ఘటన వైఎస్ రాజశేఖరరెడ్డిదని ఆయన అన్నారు. రూ.1150 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తూ వైఎస్ఆర్ మొట్టమొదటి సంతకం చేశారన్నారు. విషయాలు తెలుసుకుని అధికార సభ్యులు మాట్లాడితే బాగుంటుందన్నారు. విషయాలను తెలుసుకోండా రాళ్లు, బండలు వేస్తున్నారని మండిపడ్డారు.
తుఫానుపై ఎమ్మెల్యేల ప్రసంగాలు ఆత్మస్తుతి పరనింద మాదిరిగా సాగుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. టెక్నాలజీ గురించి పదేపదే ప్రభుత్వం చెప్తోంది కానీ 61మంది ఎందుకు చనిపోయారని ప్రశ్నించారు. అదే తుఫాను కారణంగా ఒడిశాలో మృతుల సంఖ్య 5-6కు మించి లేదని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం చెప్తున్న నష్టం అంచనాలో పెట్టే ఖర్చు ఒక్క శాతం కూడా లేదన్నారు.