నారా లోకేష్ ఆగాల్సిందే: మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు ప్లాన్
విజయవాడ: తన మంత్రివర్గాన్ని అక్టోబర్లో పునర్వ్యస్థీకరించాలనే ఆలోచన నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న ఆయన తనయుడు నారా లోకేష్ ఇంకా కొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
నిజానికి, అక్టోబర్లో మంత్రివర్గాన్ని విస్తరించి, నారా లోకేష్కు స్థానం కల్పించడంతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కొద్ది మంది శాసనసభ్యులకు ఆయన మంత్రిపదవులు కట్టబెట్టాలని అనుకున్నారు. కానీ, మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది చివరలో జరగనున్న నేపథ్యంలో దాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికలకు ముందు మంత్రివర్గాన్ని విస్తరించి కొత్త తలనొప్పులు తెచ్చుకోవద్దనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గాన్ని ముందే విస్తరిస్తే మున్సిపల్ ఎన్నికల్లో విజయావకాశాలు దెబ్బ తినే ప్రమాదం ఉందని కూడా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజాం, నెల్లిమర్ల, కందుకూరు మున్సిపాలిటీలతో పాటు శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రులతో చర్చించిన తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే విషయంపై కూడా చర్చ సాగుతోంది.
కోడెలకు మంత్రి పదవి ఇస్తారా...
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా మంత్రివర్గంలోకి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తుండడంతో ఆయనకు చోటు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఎవరెవరికి వేటు పడుతుందనేది ఆసక్తికరంగా మారింది ఒకరిద్దరు సీనియర్ నేతలు మినహా పనిచేయని మంత్రులను మంత్రివర్గం నుంచి మంత్రి వర్గం నుంచి తొలగించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు మంత్రులకు కూడా ఉద్వాసన...
గుంటూరు జిల్లా నుంచే ఇద్దరు మంత్రులపై వేటు పడుతుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కోడెల, లోకేశ్తో పాటు ఇద్దరు, ముగ్గురు కొత్త వారికి కూడా అవకాశాలు ఇచ్చేందుకు చంద్రబాబు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ మంత్రి తనయుడు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణ సదరు ప్రజాప్రతినిధికి వేటు కలిగిస్తుందని కొందరు భావిస్తున్నారు. ఈ సంఘటకు సంబంధించి అప్పుడే వేటు వేస్తారని ప్రచారం సాగింది.. ఆ ఆరోపణకు సంబంధించిన కేసు కొట్టివ యడంతో సద్దుమణిగింది.
ధూళిపాళ్లకు అవకాశం ఉంటుందా...
మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో గుంటూరు జిల్లా నుంచి పొన్నూరు ఎమ్మెల్యే, సీనియర్ నేత ధూళి పాళ్ల నరేంద్ర చౌదరి ఉన్నారు. మంత్రివర్గంలో చోటు కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ప్రస్తు తం ఆయన సంగం డెయిరీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా మంత్రిపదవిని ఆశిస్తున్నారు.
పరిటాల సునీత సేఫ్..
ప్రస్తు తం ఉన్న ముగ్గురు మహిళా మంత్రుల్లోనూ ఒకరిని తొలిగించ నున్నట్లు సమాచారం. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతకు మాత్రం ఢోకా లేదని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా మంత్రివర్గ విస్తరణలో ఆమె జోలికి వెళ్లే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి....
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి టిడిపిలోకి వచ్చిన 20 మంది శాసనసభ్యుల్లో చాలా మంది మంత్రి పదవి ఆశిస్తున్నారు. వారిలో జలీల్ ఖాన్తో పాటు భూమా నాగిరెడ్డి లేదా భూమా అఖిలప్రియ ఉన్నారు. జలీల్ ఖాన్ మైనారిటీ కోటాలో తనకు తప్పనిసరిగా మంత్రి పదవి లభిస్తుందని ఆనుకుంటున్నారు. మరో సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.