తెలుగు రాష్ట్రాలు కలవవ్, కానీ, ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: బాబు
హైదరాబాద్: తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరింతగా కష్టపడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పిలుపునిచ్చారు. తనకు రెండు తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ, ఏపీ)లు ముఖ్యమే అన్నారు. ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ 34వ ఆవర్భావ దినోత్సవం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే అవకాశం లేదని, అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసి నడిచే రోజులు వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ఎన్టీఆర్ యుగపురుషుడన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం పోరాడతామని చెప్పారు. తెలుగు ప్రజలు భౌగోళికంగా విడిపోయినా అంతా ఒకటేనన్నారు.
తెలుగు ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత నారా లోకేష్, మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ .రమణ, మోత్కుపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు.