రాజుల తర్వాత చంద్రబాబే: శివప్రసాద్, తప్పించుకు తిరుగుతున్న దొంగ: అంబటి
చిత్తూరు: నాడు రాజుల తర్వాత కళలను ప్రోత్సహిస్తోంది, పోషిస్తోంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని టిడిపి ఎంపీ శివప్రసాద్ అన్నారు. కళల ద్వారా సంక్ష్మ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని చంద్రబాబు చెప్పారన్నారు. చంద్రబాబు స్వయంగా సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షిస్తారన్నారు.
ఆర్థిక నేరగాళ్లను పంపిస్తారా: అంబటి
రాజ్యసభకు ఆర్థిక నేరగాళ్లను, మనీ లాండరింగ్ నిపుణులను పంపడమే కాకుండా కేంద్రమంత్రులుగా నియమించే సంస్కృతి టిడిపిది మాత్రమేనని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విజయ సాయి రెడ్డి విద్యావంతుడు అని, ఆయనకు అంతకు మించి మానవతా విలువలు ఉన్నాయన్నారు.
విజయ సాయి రెడ్డి మీద పెట్టిన కేసులు అన్నీ రాజకీయ పరమైనవేనని అంబటి గురువారం నాడు అన్నారు. విజయ సాయిని ముద్దాయి అంటున్న టిడిపి.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అడ్డంగా దొరికిపోయారని, నేటికీ, ఆయన తప్పించుకు తిరుగుతున్న దొంగ కాదా అన్నారు.
చంద్రబాబు మీద సీబీఐ విచారణ కూడా జరగడం లేదని, ఇంతకు మించి ఆర్థిక, రాజకీయ నేరగాడు లేడన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. టిడిపి రాజ్యసభ సీట్లు అమ్ముకున్న విషయం ఆ పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.
కేంద్రమంత్రి సుజనా చౌదరి మీద ఉన్న కేసుల గురించి, మారిషస్ బ్యాంకుల మోసాల గురించి తెలిసి కూడా సుజనను రాజ్యసభకు పంపించడం, కేంద్రమంత్రిని చేయడం టీడీపీకి మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేశారు. విజయ సాయి వంటి మేధావులు ఒక్కరు ఉన్నా రాజ్యసభ గౌరవ సభగా ఉంటుందన్నారు.
వెటర్నరీ విద్యార్థులకు జగన్ మద్దతు
పశు వైద్య కేంద్రాలను పశువైద్యశాలలుగా మార్చారని ఆరోపిస్తూ వెటర్నరీ కళాశాల విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. వారి దీక్షకు జగన్ శుక్రవారం నాడు మద్దతు పలికారు. ఈ రోజు గుంటూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు వెటర్నరీ కళాశాల వద్ద విద్యార్థుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు.