జెసిబిని నడిపిన బాబు: 'ప్రత్యేక' ఆందోళనకు మద్దతు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండుతో చేస్తున్న ఆందోళనలను తాను సమర్ధిస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కేంద్రం ఇప్పటికే కొన్ని విషయాల్లో చొరవ తీసుకుందని, కేంద్రం సహరిస్తుందని, అయినా తాము ఒత్తిడి తెస్తున్నామని ఆయన చెప్పారు.
విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మండలం నర్సిపురంలోని చెరువులో పూడికతీతకు చంద్రబాబు జేసీబీని నడిపి అందరినీ ఉత్సాహపర్చారు. అనంతరం 3 కిలోమీటర్ల దూరం పూడికమట్టి ట్రాక్టరును నడిపారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు.
ఉపాధి లేక విజయనగరం ప్రజలు వలసపోతున్నారని, వలసల నివారణకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో 42వేల చెరువులు నింపితే 2 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని చంద్రబాబు చెప్పారు. తాను జలదీక్ష చేస్తున్నానని, అవసరమైతే ప్రాజెక్టుల వద్ద బస చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసేందుకు జలదీక్ష చేపట్టానని, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైతే అక్కడే బస చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం నాడు జిల్లాలోని పార్వతీపురం మండలం నర్సిపురంలో చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్ణపాడు లావేసు వంతెనకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
ఉపాధి లేక విజయనగరం జిల్లా ప్రజలు వలసలు పోతున్నారని, వలసల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెద్దలు తవ్వించిన చెరువులను కాపాడుకోలేకపోతున్నామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో దోచుకున్నారే తప్ప ఇసుమంతైనా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఈ కారణంగానే రెండేళ్లలో పూర్తి కావాల్సిన తోటపల్లి ప్రాజెక్టు పదేళ్లయినా పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని 42 వేల చెరువులను నింపితే 2 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చంద్రబాబు వివరించారు.
చెరువుల్లోని పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకోవాలని చంద్రబాబు సూచించారు. జూన్ 3 నుంచి డ్వాక్రా మహిళల రుణాల మాఫీ చేస్తామని, తొలిదశలో బ్యాంకుల్లో ప్రతి ఒక్కరికి రూ. 3 వేలు జమ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
మండలానికో జెనరిక్ మందుల షాపు ఏర్పాటు చేసి వాటిని డ్వాక్రా సంఘాల ఆధీనంలో వుంచుతామని ప్రకటించారు. ఏపీలో పరిశ్రమల కోసం ప్రపంచమంతా తిరుగుతున్నానన్నారు. విజయనగరం జిల్లాకు ఎయిర్పోర్టు అవసరం ఉందని, భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సహరించాలని సీఎం ప్రజలను కోరారు. విజయనగరం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.