చంద్రబాబుకు సవాల్: ముద్రగడ ఓవైపు, పవన్- జగన్ మరో వైపు...
చంద్రబాబును మరోసారి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముద్రగడ ఓవైపు, ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు మరో వైపు ఆందోళనకు దిగుతున్నాయి
విజయవాడ: రాజకీయ చతురుడిగా పేరు గాంచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఒక్కసారే ఆయనను సమస్యలు చుట్టుముడుతున్నారు. కాపుల సమస్యలపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఓ వైపు ఈ నెల 25వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు.
మరో వైపు, ప్రత్యేక హోదాపై ఆర్కె బీచ్లో జల్లికట్టుపై జరిగిన ఉద్యమం లాంటిది చేయడానికి యువత కదులుతోంది. ఈ ఉద్యమానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు పలుకుతున్నారు.
అదలావుంటే, పలువురు తెలుగు సినీ నటులు ప్రత్యేక హోదా కోసం ప్రదర్శన కోసం విశాఖపట్నంలో ఆర్కె బీచ్కు కదులుతారనే మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నటులు దాదాపు అందరూ హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగుతున్నారు. వీరిని తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నిలువరిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.
ముద్రగడను ఇలా నిలువరిస్తారా...
కాపు రిజర్వేషన్ల కోసం రేపటి నుంచి పాదయాత్ర చేయనున్న ముద్రగడ పద్మనాభాన్ని ప్రభుత్వం పోలీసు బలగాలతో నిలువరించే ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ఆయనను గృహనిర్బంధం చేయవచ్చునని చెబుతున్నారు. ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 144వ సెక్షన్ విధించారు. మీడియాపైనా పోలీసులు ఆంక్షలు విధించారు. కోనసీమ ప్రాంతంలోనూ కిర్లంపూడిలోనూ ఇంటర్నెట్ సేవలు నిలిపేయాలని సర్వీసు ప్రొవైడర్లకు ఆదేశాలు వెళ్లాయి. కోనసీమలోని కాపులను ఆ రోజు రావులపాలెం చేరుకోకుండా కట్టడి చేయడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరూ రాకుండా చూడడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.అందుకు పలు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
ఆర్కె బీచ్ ప్రదర్శనకు జగన్ మద్దతు
ప్రత్యేక హోదా కోసం ఆర్కె బీచ్లో ఈ నెల 26వ తేదీ నుంచి యువత తలపెట్టిన ప్రదర్శనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా అక్కడికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేక హోదాపై బిజెపి, టిడిపి మాట తప్పాయని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య కర్నూలులో మంగళవారంనాడు అన్నారు. ప్రత్యేక హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం సరి కాదని అన్నారు. తమిళనాడులో జల్లికట్టు కోసం ఉద్యమించినట్లుగానే ప్రత్యేక హోదా కోసం ఉద్యమించడానికి ప్రభుత్వం తమతో కలిసి రావాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎటువంటి పోరాటానికైనా తమ మద్దతు ఉంటుందని అన్నారు.
ప్రదర్శనకు పవన్ కల్యాణ్ మద్దతు
ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గట్టిగానే నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఆర్కె బీచ్లో తలపెట్టన నిరసన ప్రదర్శనకు ఆయన మద్దతు పలికారు. ఆర్కె బీచ్కు ఆయన వెళ్తారా, లేదా అనేది తేలలేదు. అయితే, ప్రత్యేక హోదా పోరాటం కోసం జనసేన మంగళవారంనాడు ఓ ఆల్బమ్ విడుదల చేసింది. దేశ్ బచావో పేరుతో ఈ ఆల్బమ్ విడుదలైంది.
ఆర్కె బీచ్కు సంపూర్ణేష్ బాబు
ఆర్కె బీచ్లో ప్రత్యేక హోదా కోసం జరిగే ప్రదర్శనకు వస్తానని హీరో సంపూర్ణేష్ బాబు ప్రకటించారు. ఆయన తెలంగాణకు చెందినవారు. దీంతో తెలంగాణ నుంచి ఫేస్బుక్లో కొంత మంది ఆయనపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం కోసం మాట సాయం చేయని సంపూర్ణేష్ బాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమానికి మద్దతు పలకడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన సంపూర్ణేష్ బాబు తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచిన దాఖలాలు లేవని అంటున్నారు.
చంద్రబాబుకు కష్టమేనా...
ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన ఆర్కె బీచ్ ప్రదర్శనకు జగన్, పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించడం వల్ల దాన్ని అడ్డుకోవడం చంద్రబాబుకు తలనొప్పిగానే పరిణమించవచ్చునని అంటున్నారు. అనుమతి లేదనే కారణంతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రత్యేక హోదాపై మాట్లాడిన పవన్ కల్యాణ్కు చంద్రబాబు ఇటీవల చురకలు కూడా అంటించారు. జగన్ తీరునైతే ఆయన తీవ్రంగా దుయ్యబడుతున్నారు. మరోవైపు, ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకుంటే ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. అయితే, పోలీసులు ఆయన యాత్రను అడ్డుకునేందుకు పకడ్బందీ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు.