2 నెలలు: చంద్రబాబుకు 3 చిక్కులు!!: 'రాయలసీమ' హెచ్చరిక?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల వరుసగా విపక్షాల నుండి ఘాటైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత రెండు నెలలుగా ఆయన పైన ఏపీలో విపక్షాలు కాంగ్రెస్, వైసీపీలతో పాటు తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ నుండి చిక్కులు ఎదుర్కొంటున్నారు.
ఓటుకు నోటు కేసు, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, అభివృద్ధి వికేంద్రీకరణ తదితర సమస్యలు చంద్రబాబును చుట్టుముడుతున్నాయి.
దాదాపు రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోని ఓటుకు నోటు అంశం చంద్రబాబును వెంటాడుతోంది. ఈ కేసులో చంద్రబాబు రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. టీఆర్ఎస్ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కేసులో బాబు పాత్ర ఉందని చెబుతోంది.
ఆ తర్వాత గోదావరి పుష్కరాలు చంద్రబాబుకు చిక్కులు తెచ్చాయి. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించారు. అయితే, తొలి రోజు జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి పైన పెద్ద ఎత్తున విమర్సలు వెల్లువెత్తాయి.
చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్లనే ఇది జరిగిందని, ఇందుకు ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు మండిపడ్డాయి. అయితే, తొక్కిసలాట జరిగిన ఘాట్ వద్ద తాను స్నానం చేయలేదని చంద్రబాబు ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు.
ఇటీవల రాయలసీమ ప్రాంత నేతలు చంద్రబాబు పైన మండిపడుతున్నారు. వారి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఎప్పుడైనా రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు రోజుల క్రితం డిఎల్ రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధి కోసం అందరం గళమెత్తాలని, లేదంటే చంద్రబాబు రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తారని ఆరోపించారు. అంతకుముందు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎపికి ప్రత్యేక హోదా అవసరం లేదని, కోస్తా, రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందని ఆయన చెప్పారు. అంతకుముందు స్వయంగా ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రబాబు చూపు అంతా పశ్చిమ గోదావరి పైనే ఉందని, కర్నూలుపై చిన్నచూపు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలకు చంద్రబాబు కౌంటర్ ఇవ్వడం వేరే విషయం. కర్నూలు జిల్లా అభివృద్ధి విషయంలో తాను సవాల్ చేస్తున్నానని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు.