బాబునే వెక్కిరించిన ఆర్థిక పరిస్థితి: తిప్పికొట్టిన ఆర్థిక శాఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడినే వెక్కిరించిందంటూ ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక వార్తాకథనం ప్రచురుచింది. తన సొంత నియోజకవర్గంలో ఒక సంస్థను నెలకొల్పడానికి అవసరమైన నిధులను సమకూర్చాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రతిపాదనలు పంపిస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు ఇవ్వటం సాధ్యం కాదని ఆర్థికశాఖ ఆ ప్రతిపాదనను తిప్పికొట్టిందంటూ ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక రాసింది. కార్మిక శాఖనుంచైనా తీసుకుందామని ఆయన ప్రయత్నిస్తే అక్కడా చుక్కెదురైందంటూ వ్యాఖ్యానించింది. రూల్స్ ఒప్పుకోవంటూ ఆ శాఖ కూడా నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిపింది.
ఆంధ్రజ్యోతి వార్తాకథనం వివరాలు ఇలా ఉన్నాయి - భవన నిర్మాణ కార్మికులకు వృత్తి నైపుణ్యం కల్పించి వారి ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో హైదరాబాదులో నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్ (న్యాక్) ఏర్పాటు చేశారు. సాక్షాత్తూ చంద్రబాబునాయుడే ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. ఏటా కొన్ని వేల మందికి వృత్తి నైపుణ్యత శిక్షణ ఇస్తున్న ఇలాంటి సంస్థను తన నియోజకవర్గమైన కుప్పంలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఒక ఇంటి నిర్మాణానికి ఏయే విభాగాలు అవసరమో లెక్కలు తీశారు. సిమెంటు పని, విద్యుద్ధీకరణ, డ్రైనేజీ, రంగులు వేయటం.. తదితర 12 విభాగాలు కలిస్తే భవన నిర్మాణం సాఫీగా జరుగుతుందని లెక్కగట్టారు.
కుప్పంలో ఏర్పాటుచేయబోయే న్యాక్ సెంటర్లో ఈ 12 విభాగాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో విభాగంలో 40 మందికి చొప్పున ప్రవేశాలు కల్పించి ఆరు నెలలపాటు శిక్షణ ఇవ్వడం ద్వారా వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ జిల్లాల యువతకు భవన నిర్మాణ వృత్తి నైపుణ్యత పెంపొందించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఈ పథకాన్ని రూపొందించారు. దీనికిగాను 17 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన ముఖ్యమంత్రి అందుకు అవసరమైన నిధుల కోసం ఫైలును ఆర్థిక శాఖకు పంపారు.
ఒక నిర్మాణ శిక్షణ సంస్థకు 17 కోట్ల రూపాయలు మంజూరుచేసే పరిస్థితి ఇప్పుడు లేదని, ఈ నిధులను మరెక్కడినుంచైనా సమకూర్చుకోవాలని సూచిస్తూ ఆర్థికశాఖ ఆ ఫైలును వెనక్కి పంపేసింది. దీంతో చేసేదేమీలేక దీనిని కార్మికశాఖకు పంపారు. కార్మిక శాఖకు అనుబంధంగా ఉన్నా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిలో ఏపీ వాటా కింద సుమారు 500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ నిధుల నుంచి 17 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే న్యాయపరంగా అలా చేయడం కుదరదని కార్మిక శాఖ తేల్చింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాల్సిన ఈ నిధులను శిక్షణ కార్యక్రమాలకు వినియోగించకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినందున కుప్పం శిక్షణ సంస్థకు ఆ నిధులను ఇవ్వటం కుదరదని అధికారులు తేల్చారు. దీంతో చంద్రబాబు కూడా విస్మయానికి గురైనట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది.