జగన్ బయటకొస్తాడంటే బాబుకు భయం: శోభా నాగిరెడ్డి
జగన్ బెయిల్ అడ్డుకోవడనికా లేక గతంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ సరైనదేనని చెప్పడానికి ఢిల్లీ వెళ్తున్నారా అని చంద్రబాబును ప్రశ్నించారు. జగన్ బయటికి వస్తున్నారంటే చంద్రబాబుకు ఎందుకంత భయమో అర్థం కావడం లేదని అన్నారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని శోభానాగిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీనే కుమ్మక్కైందని ఆమె విమర్శించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా సాగుతుంటే తెలుగుదేశం పార్టీ నేతలు తమ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు. సీమాంధ్రలో ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న ప్రస్తుత తరుణంలో 30 లోక్ సభ స్థానాలు సాధిస్తామనడం పట్ల ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారని అమె విమర్శించారు.
చంద్రబాబుకు ఏమైనా కోపం ఉంటే తమపై చూపించాలని, ప్రజలపై కాదని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ వైఖరి మార్చుకోకుంటే రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని శోభానాగిరెడ్డి హెచ్చరించారు.
రాజకీయ లబ్ధి కోసమే బాబు యాత్రలు: పొంగులేటి
రాజకీయ లబ్ధి కోసమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చిందని ఆరోపిస్తున్న చంద్రబాబు, గతంలో విభజనకు అనుకూలంగా తను ఇచ్చిన లేఖ గురించి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు.