పనిలేక కూర్చున్నామా!: చంద్రబాబు సీరియస్, జన్మభూమిలో స్వయంగా అటెండెన్స్
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా కనిపిస్తే ఆయన సహించరు. తాజాగా, జన్మభూమిపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్కు అత్యధిక శాతం జన్మభూమి కమిటీ సభ్యులు హాజరుకాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం 11 గంటల ఉంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మూడు గంటల పాటు సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్ చివరిలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలానికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యుడు కొన్ని సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు.
కాగా, వాటికి బదులు ఇచ్చిన సీఎం.. ‘మీ మండలం నుంచి ఎంత మంది జన్మభూమి కమిటీ సభ్యులు వచ్చారు' అని ఆయన్ని ప్రశ్నించారు. దీంతో ఇద్దరమే వచ్చామని ఆయన సమాధానం ఇవ్వడంతో సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మేం పని లేకుండా ఇక్కడ కూర్చున్నామా? ప్రభుత్వ పథకాల పట్ల మీకు అవగాహన పెంచి, బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేలా చూసేందుకు మిమ్మల్ని కూడా కాన్ఫరెన్సకు రమ్మన్నాం, ఇష్టం లేకపోతే తప్పుకోవచ్చు' అంటూ జన్మభూమి కమిటీ సభ్యులను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు.
అవసరమైతే బస్సు ఛార్జీలు ఇచ్చి జన్మభూమి కమిటీ సభ్యులను సమావేశాలకు రప్పించాలని సీఎం ఆదేశించారు. సక్రమంగా స్పందించని జన్మభూమి కమిటీ సభ్యులను మార్చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్కు వచ్చిన జన్మభూమి కమిటీ సభ్యుల హాజరును పరిశీలించేందుకు సీఎం స్వయంగా ఐదు జిల్లాల అటెండెన్స్ తీసుకున్నారు.
చాలా చోట్ల సభ్యుల హాజరు నామమాత్రంగా ఉన్నట్లు గుర్తించారు. అత్యధిక మండలాల్లో మండల ప్రత్యేకాధికారులు కూడా గైర్హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్లో దృశ్య, శ్రవణ అంతరాయాల పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. తదుపరి సమావేశానికి పొరపాట్లు సరిదిద్దాలని ఐటీ అధికారులను ఆదేశించారు.