ఏం గోళ్లు గిల్లుకుంటున్నారా?, రిజల్టేదీ?: చంద్రబాబు హెచ్చరిక
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. పనుల తీరును సమీక్షించాల్సిన బాధ్యత లేదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని, తన మాటను తేలిగ్గా తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని కాంట్రాక్టర్లనూ హెచ్చరించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ప్రతి సోమవారమూ కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో నిర్వహించే సమీక్షలో భాగంగా.. నిర్ణీత సమయంలో కంటే ఆలస్యంగా సాయంత్రం ఐదు గంటలకు పోలవరం వర్చువల్ సమీక్ష మొదలైంది. దాదాపు గంటన్నర సేపు జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు సీఈ రమేశ్ బాబుపై సీఎం చంద్రబాబు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు సీఈ రమేశ్ బాబును ఉద్దేశించి మాట్లాడుతూ 'ఏం రమేశ్ బాబు.. ఇక్కడ గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నావా? కాంట్రాక్టు సంస్థలు ఏమేరకు పనిచేస్తున్నాయో సమీక్షించాల్సిన పనిలేదా?' అని సీరియస్ అయ్యారు. కాగా, కొన్ని యంత్రాలు ఇంకా రావాల్సి ఉందన్న రమేశ్ బాబు వ్యాఖ్యలను సీఎం పట్టించుకోలేదు. జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్పైనా చంద్రబాబు మండిపడ్డారు.
'నువ్వేదో బాగా పనిచేస్తావనుకుని కీలకమైన జలవనరుల శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించా. కానీ ఏం బాగాలేదు. నువ్వు అప్ టు ది మార్క్గా లేవు. యు షుడ్ కమ్ డౌన్ టు ది ఎర్త్. వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. లేకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది' అని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు.
ఈ సమయంలో వాతావరణాన్ని చల్లబరిచేందుకు ఈఎన్సీఎం వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. గతంతో పోలిస్తే ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఉందని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ఆయనపైనా మండిపడ్డారు. తనకు కావాల్సింది పురోగతి కాదని, రిజల్ట్ అని పేర్కొన్నారు.
ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నా పనులు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని సకాలంలో పూర్తిచేసి వారిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పస్టం చేశారు.