కాంగ్రెస్ అభ్యర్థికి చంద్రబాబు రూ. 10 కోట్లు: భూమన
చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థికి రూ.10 కోట్లు ఇచ్చారని వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి ఆరోపణ.
నంద్యాల: కుట్రలు చేసేందుకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు మళ్ళీ ఒక్కటౌతున్నాయని వైసీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి ఆరోపించారు.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకుగాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చంద్రబాబునాయుడు రూ. 10 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని జైలుకు పంపేందుకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్, టిడిపి దొంగనాటకాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్కు వేసే ఓటు డ్రైనేజీలో వేసినట్టేనని భూమన కరుణాకర్రెడ్డి వ్యాఖ్యానించారు.రైతులు. డ్వాక్రా మహిళలు, ముస్లింలు కాపులు, దళితులు, విద్యార్థులు సహ అందరిని చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు.లోకేష్ను దేశంలోనే అత్యంత సంపన్నుడిగా చేసేందుకుగాను చంద్రబాబు భూబకాసురుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
వైసీపీ బిజెపితో చేతులు కలుపుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.బిజెపి జెండా కన్పించకుండా ఆ పార్టీతో అంటకాగుతోంది చంద్రబాబునాయుడు మాత్రమేనని చెప్పారు.నంద్యాలలో ప్రజలు టిడిపికి గుణపాఠం చెబుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.