చిక్కుల్లో బాబు ప్రభుత్వం: చెల్లింపుల నిలిపివేత
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధికంగా కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి ప్రభుత్వ చెల్లింపులను నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ఆర్ధిక శాఖ ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ట్రెజరీల నుంచి బ్యాంకులకు ఎలాంటి బిల్లుల చెల్లింపులు జరపవద్దని, వీలైతే చెల్లించిన బిల్లులు వెనక్కి తీసుకోవాలని ఆర్ధిక శాఖ ట్రెజరీలకు అదేశించింది. నెలాఖారులో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సి ఉండటంతో ఆర్ధిక శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక చిక్కుల్లో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు చెప్పకనే చెప్పారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో ఆ విషయం చెప్పారు.
రాష్ట్రంలో ఆర్థిక లోటు రోజు రోజుకూ పెరుగుతోందని ఆయన అన్నారు ఆర్థిక లోటు పెరుగుదల అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని ఆయన అన్నారు అవసరమైతే వివిధ మార్గాల్లో అప్పులు చేసైనా సరే రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం తమపై ఉందని యనమల అన్నారు.
కేంద్రం సాయం చేస్తే తప్ప బయటపడడానికి వీలు కాదనే పద్ధతిలో చంద్రబాబు మాట్లాడారు. కేంద్రం నుంచి ఆశించిన సాయం అందడం లేదని కూడా అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కార్యక్రమాలను కుదించుకున్నట్లు కూడా తెలిపారు. ఇప్పటి వరకు గంభీరంగా ఉంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా ఆర్థిక చిక్కుల విషయంలో నోరు విప్పింది.