బాబు, మోడీలను దులిపేసిన చిరు, 4గురు కార్పోరేట్లకే..
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ పైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గురువారం విరుచుకుపడ్డారు. మోడీ, చంద్రబాబులవి పబ్లిసిటీ స్టంట్లని విమర్శించారు. రాజధాని కోసం భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగితే తాము వారి తరఫున పోరాటం చేస్తామన్నారు.
నలుగురు కార్పోరేట్ల చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ కూడా కార్పోరేట్లు చెప్పిందే చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల వచ్చిన హుధుద్ తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తుఫాను వస్తుందని తెలిసినా సహాయక చర్యలు చేపట్టలేదన్నారు.
తుఫాను సమయంలోను చంద్రబాబు పబ్లిసిటీ కోసం పాకులాడారని మండిపడ్డారు. రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు రోజుకో మాట చెప్పి ప్రజల నుండి తప్పించుకుంటున్నారన్నారు. బ్లాక్ మనీ పైన బీజేపీది ద్వంద్వ వైఖరి అన్నారు.
కేంద్రం దగ్గర చంద్రబాబుకు ఏమాత్రం పలుకుబడి లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో బాబు విఫలమయ్యారని, పచ్చని పొలాల్లో రాజధాని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్నారు. భూమి విషయంలో రైతులను ఒఫ్పించాలే తప్ప బెదిరించవద్దన్నారు. రుణమాఫీ పైన చంద్రబాబు సాగదీసే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు.
మహిళలను అడ్డు పెట్టుకొని చంద్రబాబు ఇసుక మాఫియా నడుపుతున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు జేబుదొంగల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. ధనవంతులకే టీడీపీ నేతలు ఊడిగం చేస్తున్నారన్నారు. 1994-2004 వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఊచకోత కోసిన ఘనత చంద్రబాబుదే అని ఆరోపించారు.
అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ నడిపిన రెండు గ్రూపులు ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నాయని విమర్శించారు. టీడీపీ వెబ్ సైట్ నుండి ఎన్నికల మేనిఫెస్టోను ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ హామీలను మాఫీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సురెన్స్ రుణమాఫీకి జత చేస్తున్నా టీడీపీ నేతలు దద్దమ్మల్లా ఉన్నారన్నారు. కాగా, అనంతపురంలో ఏపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది.