జగన్ దీక్ష, బాబు డోంట్ కేర్!: '100 రోజులు చేసినా నష్టం లేదు, చర్చకే రాలేదు'
గుంటూరు/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆరు రోజుల పాటు దీక్ష చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ వల్ల ప్రయోజనం ఏమీ లేదని టిడిపి నేతలు మండిపడుతున్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వేర్వేరుగా జగన్ పైన మండిపడ్డారు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్ష చేశారని పయ్యావుల అన్నారు.
ప్రధాని మోడీ ప్రత్యేక హోదా పైన దసరా పర్వదినం రోజున ప్రకటన చేస్తారనే దీక్షకు పూనుకున్నారన్నారు. ప్రజలు దూరమవుతున్నారని ఆయన దీక్ష చేశారన్నారు.
ప్రతిపక్ష నేత జగన్ దీక్ష పైన కేబినెట్ భేటీలోనే చర్చ జరగలేదంటే ఆయన దీక్షకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చునని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. జగన్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్షను పోలీసులు భగ్నం చేశారన్నారు.
జగన్ దీక్ష భగ్నం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్నారు. జగన్ లేదా వైసిపి నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. జగన్ మరో వంద రోజులు దీక్ష చేసినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. కానీ జగన్ ఆరోగ్యం దృష్ట్యా భగ్నం చేశారన్నారు.
ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రకటన
ఏపీకి ప్రత్యేక హోదా పైన, అలాగే ప్యాకేజీ పైన రెండు మూడు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసే అవకాశం ఉందని విప్ వంగర రామ్మోహన్ మంగళవారం వెల్లడించారు. టిడిపి - బిజెపి మైత్రిని చెడగొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.