'తమ్ముడు' నుంచి 'అన్నయ్య' దాకా: వారికి చంద్రబాబు డోర్లు ఓపెన్!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరినీ దూరం చేసుకోవద్దనే ఆలోచనతో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు. 'తమ్ముడు' పవన్ కళ్యాణ్ నుంచి 'అన్నయ్య' చిరంజీవి వరకు చంద్రబాబు సానుకూలంగా కనిపిస్తున్నారు.
అలాగే, కాంగ్రెస్, దాని నుంచి పుట్టుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను మాత్రమే బద్ద శత్రువులుగా చూస్తూ, బీజేపీ, జనసేనలతో మైత్రికే మొగ్గు చూపుతున్నారు. 2019 ఎన్నికల నాటికి ఎవరిని దూరం చేసుకోవద్దనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని బిజెపి చెప్పిన తర్వాత టిడిపి కేంద్రం నుంచి బయటకు వస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు తాడోపేడో తేల్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ హోదా ఇవ్వమని చెప్పాక అందుకు విరుద్ధంగా జరిగింది.
కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటిస్తానని చెప్పిందని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి కేంద్రం సహకారం అవసరమని, కాబట్టి బీజేపీతో తెగతెంపులు చేసుకోలేమని తేల్చి చెప్పింది.
ఎన్నికలకు ముందు, విభజన సమయంలో చంద్రబాబు రాజధాని నిర్మాణానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల కోట్లు డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, అలాగే చంద్రబాబు భావించినట్లుగా అన్ని లక్షల కోట్లు ఇవ్వడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీని దూరం చేసుకునే ఆలోచన చంద్రబాబుకు లేదు.
అలాగే, రాజధాని భూసమీకరణ నుంచి హోదా వరకు తనను నిలదీసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల కూడా టిడిపి సానుకూలంగానే ఉంది. ఒకే అంశాన్ని జగన్ లేవనెత్తితే రాజకీయ లబ్ధి కోసంగాను, పవన్ లేవనెత్తితే చిత్తశుద్దితో మాట్లాడుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.
తద్వారా పవన్ కళ్యాణ్ను దూరం చేసుకునే ఆలోచన చేయడం లేదని అర్థమవుతోంది. 2014 ఎన్నికల్లో పవన్ వల్లే కాపులు టిడిపి - బిజెపి కూటమికి ఓటు వేశారు.
తాజాగా, టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న టర్పో మెఘా ఎయిర్ వేస్కు రూ.4.90 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఎలాంటి రాజకీయం లేకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి తనయుడి ఎయిర్ వేస్కు నిధులు విడుదల చేసింది. కేవలం జగన్, కాంగ్రెస్ పార్టీలనే చంద్రబాబు టార్గెట్గా పెట్టుకున్నారని అంటున్నారు.
అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్న చంద్రబాబు ఆ పార్టీలోని నేతలకు మాత్రం ఆహ్వానం పలుకుతున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి గల్లా అరుణ, టిజి వెంకటేష్, జేసి దివాకర్ రెడ్డి వంటి వారు చేరారు. ఎన్నికల అనంతరం వైసిపి నుంచి 20 మంది ఎమ్మెల్యేలు చేరారు. తద్వారా ఆ పార్టీలలోని ముఖ్య నేతలకు మాత్రం డోర్లు ఓపెన్ చేసి పెట్టారని చెప్పవచ్చు.