ఇన్నాళ్ల శ్రమ వృథా అవుతుంది, పెట్టుబడులెలా..: బాబు ఆసక్తికర వ్యాఖ్య
విజయవాడ: రాజధాని అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఆర్డీయే సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సీఆర్డీఏ అథారిటీతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రాష్ట్ర, రాజధాని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు, ప్రజలు సహకరించాలని కోరారు. ఇలా అలజడులు సృష్టిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల్లో అటవీ భూముల అనుమతులు పూర్తి చేయాలన్నారు. అవసరమైతే తాను కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు.
రాజధాని విషయంలో అలజడులు సృష్టిస్తే ఇన్నాళ్ల శ్రమ వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇలాంటి సమయంలో రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు.
రెచ్చగొట్టి రాజధానిలో కొందరు ఆందోళనలు రేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అలజడులు సృష్టిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. రాజధాని గ్రామాల్లో నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షన ఇవ్వాలని సూచించారు.
శిక్షణార్హులకు నెలకు రూ.1000 భృతి, శిక్షణ సామాగ్రి ఇవ్వాలన్నారు. ఉచిత భోజన సదుపాయం కల్పించాలన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం చెగడొడితే ఇన్నాళ్లు పడిన శ్రమ వృథా అవుతుందన్నారు.
నేను ప్రపంచమంతా తిరిగి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే కొందరు ప్రజలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ల ఎంపిక రాజధాని ప్రాంతంలో కాన్సెప్ట్ సిటీలను నిర్మించే యోచన ఉందన్నారు.
రాజధాని పరిధిలో హైకోర్టు, న్యాయ విశ్వవిద్యాలయం ఒకేచోట ఉండేలా, సైన్స్ సిటీ తరహాలో జస్టిస్ సిటీ ఏర్పాటుకు యోచిస్తున్నామని చెప్పారు. నెల రోజుల్లో అటవీ శాఖ డీనోటిఫై కావాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. కాగా, చంద్రబాబు పేరు చెప్పనప్పటికీ పరోక్షంగా జగన్ను ఉద్దేశించి అన్నారని అంటున్నారు.