ఢిల్లీ ధర్నా చేస్తాం: ప్రత్యేకహోదాపై జగన్, రాహుల్పై విసుర్లు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్రం దిగిరాకపోతే తమ పార్టీకి చెందిన 67 మంది శాసనసభ్యులు, ఏడుగురు ఎంపీలతో ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన చెప్పారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం మడకశిర నియోజకవర్గంలో ఆయ విషయం చెప్పారు.
కేంద్రం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కళ్లు తెరిపించేలా ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ ఏనాడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేదని ఆయన అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందించింది తమ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. ప్రచారం లభించే చోట మాత్రమే చంద్రబాబు హరిహారం చెల్లిస్తారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాను ఇప్పటికే కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలిశానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిది మోసపూరిత పాలన అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. పింఛన్లు, రేషన్ కార్డులు నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
జగన్ రైతు భరోసా యాత్రం అనంతపురం జిల్లాలో సోమవారంనాడు ఏడో రోజుకు చేరుకుంది. ఆయన సోమవారంనాడు పిసి గిరిలోని బీడు భూములను పరిశీలించారు. పంటలు ఎందుకు సాగు చేయడం లేదని రైతులను అడిగారు.
అనంతపురం జిల్లాలో 20 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేయాల్సి ఉందని, ఇప్పటి దాకా వర్షాలు రాకపోవడంతో కేవలం 5 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయని, ప్రకృతి వైపరీత్యాలకు తోడు పాలకుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని ఆయన అన్నారు.
అనంతపురం జిల్లా రైతులకు 5 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం లక్షన్నర క్వింటాళ్లను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసిందని, ఇచ్చిన విత్తనాలను కూడా బ్లాక్ మార్కెట్కు తరలించి టిడిపి నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.
రైతులకు రుణమాఫీ జరగలేదని, రుణమాఫీ కాకపోవడంతో రైతులపై అపరాధ రుసుం పడుతోందని, గతంలో పావలా వడ్డీ చెల్లించే రైతులు ఇప్పుడు 14 శాతం వడ్డీ కట్టాల్సి వస్తోందని, ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రైతులకు ఇవ్వలేదని, కరువు కాటకాలతో తట్టుకోలేక అనంతపురం జిల్లా రైతులు బెంగళూరుకు వలసపోతున్నారని ఆయన చెప్పారు. రైతుల ఆత్మహత్యలు, వలసల పరిస్థితిని శాసనసభలో ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు.