చక్రం తిప్పారా?: పవన్కళ్యాణ్, బీజేపీ చెప్పిన వారికి బాబు ఓకే!
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో పదవుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరించారని తెలుస్తోంది. తెలంగాణలో ఇద్దరికి పాలకమండలిలో చోటు కల్పించడం వ్యూహాత్మకమేనని మొదటి నుండి భావిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు తెరాసలో చేరారు. అలాగే, గ్రేటర్ హైదరాబాదులో తలసాని, తీగల వంటి సీనియర్ నేతలతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు కూడా కారు ఎక్కారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం, హైదరాబాదులకు చెందిన సండ్ర వెంకట వీరయ్య, జి సాయన్నలకు చోటు కల్పించారు.త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయిన సాయన్నకు అవకాశం కల్పించడం వెనుక అది కూడా కారణం అంటున్నారు.
వీరితో పాటు ఏపీకి చెందిన లలిత కుమారి, అనంత లక్ష్మి, వీరాంజనేయ స్వామి, సుధాకర్ యాదవ్ తదితరులకు చోటు కల్పించారు.
మిగతా వారిలో సుచిత్ర ఎల్లా, డీపీ అనంత, కే రాఘవేంద్ర రావు, సంపత్ రవి నారయణ్, పసుపులేటి హరిప్రసాద్, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి, శేఖర్ తదితరులు ఉన్నారు.
కర్నాటకకు చెందిన డీపీ అనంతకు కేంద్రమంత్రి ఉమాభారతి మద్దతిచ్చారని తెలుస్తోంది. మరో రాష్ట్రానికి చెందిన సంపత్ రవి నారాయణ్కు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అండదండల వల్ల దక్కిందని చెబుతున్నారు.
తమిళనాడుకు చెందిన వీ కృష్ణమూర్తికి అమిత్ షా చొరవతో, జే శేఖర్కు జయలలిత సిఫార్సుతో దక్కాయని తెలుస్తోంది. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల హరిప్రసాద్కు పాలకమండలిలో సభ్యుడిగా అవకాశం దక్కిందని తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చాలా రోజులుగా సేవలు అందిస్తున్నారు.