చంద్రబాబు, పవన్, జగన్.. ముగ్గురికీ మోడీ భయమే!, అందుకే హోదా అటకెక్కింది!?
విజయవాడ : చంద్రబాబు, పవన్, జగన్.. పార్టీలకతీతంగా వీరి ముగ్గురిలో ఉన్న ఉమ్మడి లక్షణం.. ప్రధాని నరేంద్ర మోడీ అంటే భయం. ఇప్పుడిదే మాట ఏపీ అంతటా వినిపిస్తోంది. ఓటుకు నోటు వ్యవహారమో.. మరేమో గానీ ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని హోదాపై ఎన్నడూ గట్టిగా నిలదీయలేదు. ఆఖరికి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతోనే సంతృప్తి చెందారు. ఇకముందు కూడా ఆయన వైఖరిలోను పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఇటు రాష్ట్రానికి ఇచ్చిన రుణమాఫీ లాంటి పథకాలను సైతం చంద్రబాబు సమర్థంగా అమలుచేయలేకోపోయారనే అపవాదు కూడా ఆయనపై ఉంది.
ఇక ప్రతిపక్ష నేత జగన్ వైఖరి కూడా దాదాపుగా అంతే. సభల్లోను, తన ప్రసంగాల్లోను హోదాపై టీడీపీ వ్యవహారాన్ని ఎండగట్టడమే తప్పించి కేంద్రం వైఖరిని గానీ ప్రధాని మోడీని గానీ ఎన్నడూ విమర్శించే ధైర్యం లేదు. నిన్నటి యువభేరి సభలో మాత్రం గతంలో హోదాపై మోడీ మాట్లాడిన వీడియోలను జనం ముందుపెట్టారు. అది అక్కడికే పరిమితమైంది తప్పితే.. ఆ తర్వాత తన ప్రసంగంలో హోదాపై మోడీని గట్టిగా నిలదీసిన దాఖలా లేదు.
హోదా విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి నిజానికి జగన్ కు ఇదొక మంచి అవకాశం. అయితే కేవలం రాజకీయ లబ్ది పొందాలనే వ్యవహారంతోనే తప్పితే.. ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టే వ్యూహాలలో జగన్ విఫలమవుతున్నారనే వాదన ఉంది. దానికి తోడు ఆయన్ను వెంటాడుతున్న కేసుల కారణంగానే.. ప్రధాని మోడీని హోదాపై విమర్శించే సాహసం చేయలేకపోతున్నారనే వాదన కూడా ఉంది.
ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఖరి మరింత విచిత్రం. ఎవరితోను అంటీముట్టనట్టుగానే కనిపిస్తాడు. అంతలోనే పరోక్షంగా చంద్రబాబుకు అనుకూలం అన్న తరహాలోను వ్యవహరిస్తాడు. ఇక ప్రధాని మోడీని అయితే పల్లెత్తు మాట అనడానికి సాహసం చేయడు. మొన్నటి తిరుపతి, కాకినాడ సభల ద్వారా కేంద్రమంత్రులను, ఎంపీలను టార్గెట్ చేసుకుని మాట్లాడారే తప్పితే.. ఎక్కడా చంద్రబాబును గానీ, మోడీని గానీ విమర్శించలేదు. అంటే.. ఒకవిధంగా సేఫ్ గేమ్ స్ట్రాటజీనే పవన్ ఫాలో అవుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది.
ఏదేమైనా హోదా విషయంలో ఈ ముగ్గురు నాయకులది వైఫల్యమే అన్న చర్చ జరుగుతోంది. ఎటొచ్చి బాధంతా ప్రజలకే కాబట్టి.. తమ రాజకీయ ప్రయోజనాల కోసమో, స్వప్రయోజనాల కోసమో కాకుండా.. నిజంగా ప్రజల తరుపున నిలిచి పోరాడే వ్యక్తి కోసం ఏపీ జనం ఆశగా ఎదురుచూస్తున్నారు.