గవర్నర్ సాక్షిగా ఇద్దరు 'చంద్రులు' మాట్లాడుకున్నారు
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ సాక్షిగా ఇద్దరు చంద్రులు మాట్లాడుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసార రాజభవన్లో కలిశారు. వారు మాట్లాడుకున్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ఇరువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. గవర్నర్కు ఇరు వైపులా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆసీనులయ్యారు.
గణతంత్రదినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ మర్యాదపూర్వకంగా ఇచ్చే విందుకు వారిద్దరు హాజరయ్యారు. రెండు రాష్ర్టాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్భవన్కు వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులకు గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికారు. తేనేటి విందు ఏర్పాటు చేసిన హాలులోకి తీసుకువెళ్లారు.
ఎప్పుడూ లేని విధంగా గవర్నర్ నరసింహన్ ఘనంగా విందు ఏర్పాటు చేశారు. సంగీతంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. విందు అనంతరం గవర్నర్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడి విడిగా సమావేశమయ్యారు. రాష్ట్రాల సమస్యలపై చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు.
ఇదే సమయంలో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. నవ్యాంధ్ర రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతం బాగుందని కెసిఆర్ అన్నారు. కృష్ణానది పక్కన రాజధాని వాస్తు రీత్యా మంచిదని ఆయన చెప్పారు. కృష్ణా నది పక్కన ఆకాశహార్మ్యాలు, వంతెనలు నిర్మిస్తే త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. సంభాషణ మధ్యలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ కృష్ణానది పక్కన రాజధాని బాగుంటుందని అన్నారు. వాస్తు ప్రకారమే రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు కెసిఆర్తో చెప్పారు.
రెండు రాష్ర్టాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని, చాలా సంతోషంగా ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఎంసెట్ నిర్వహణపై కూడా ఇరువురు ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ మాట్లాడినట్లు సమాచారం. ఎంసెట్ ఏ రాష్ట్రం నిర్వహించాలనే విషయంపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఆ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాలు చెరో సంవత్సరం ఎంసెట్ నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించినట్లు చెబుతున్నారు.