జనసేన లెక్క తేలుస్తోన్న టీడీపీ : కటీఫా?, కలిసే సాగడమా?
విజయవాడ : జనాల్లో పార్టీ పట్ల స్థిరాభిప్రాయం ఉందా..? లేక ఎప్పటికప్పుడు ప్రజల్లో పార్టీ స్థానం మారిపోతుందా..? అన్న అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ప్రముఖ సంస్థతో సర్వే నిర్వహించిన చంద్రబాబు.. సర్వేపై అసంతృప్తితో, సొంతంగా పార్టీ తరుపునే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది.
తాజా సర్వే ప్రకారం.. టీడీపీ ఏర్పాటు చేసిన ఓ నంబర్ నుంచి ఏపీలోని ప్రజలందరికీ ఓ ఫోన్ కాల్ వెళుతోంది. 'ఉన్న పలంగా ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటెస్తారన్న ప్రశ్నను' సదరు ఫోన్ కాల్ ద్వారా అడుగుతున్నారు. ఇందుకోసం టీడీపీ-బీజేపీ కూటమి, వైసీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలను ఆప్షన్లుగా జనం ముందుంచుతున్నారు. ఆ తర్వాత ఆయా వ్యక్తుల అభిప్రాయం మేరకు ఏ పార్టీకి మైలేజ్ పెరుగుతోందా! అన్న అంశాన్ని రికార్డు చేస్తున్నారు.
జనసేన లెక్క తేల్చడానికేనా?
2014ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి ప్రత్యక్ష మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ప్రస్తుత సర్వేలో విడిగా ఆప్షన్ ఇవ్వడం కొంత ఆసక్తికరంగా మారింది. జనసేన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుని.. వచ్చే ఎన్నికల నాటికి జనసేన అవసరం ఏ మేర ఉందనే దానిపై కూడా టీడీపీ లెక్కలు కడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే టీడీపీ-బీజేపీ కూటమిలతో కాకుండా, జనసేనకు విడిగా ఆప్షన్ కేటాయించినట్లు సమాచారం. అంటే.. జనాల్లో జనసేనకు ఉన్న మైలేజ్ ఆధారంగానే 2019 ఎన్నికల్లో ఆ పార్టీని పక్కన పెట్టుకోవడమా..! పట్టించుకోకపోవడమా..! అన్న అంశాలను టీడీపీ ఇప్పటినుంచే అంచనా వేస్తోందన్నమాట.