లోకేష్ నివేదిక: ముగ్గురికి ఉద్వాసన, బాబు క్యాబినెట్లోకి పయ్యావుల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గోదావరి పుష్కరాల తర్వాత ఈ నెలాఖరున ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించవచ్చునని అంటున్నారు. ముగ్గురికి ఉద్వాసన పలికి, కొత్తగా ఆరుగురిని మంత్రవర్గంలో చేర్చుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.
మంత్రుల పనితీరుపై ఇప్పటికే ఆయన వద్ద నివేదికలు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరుపై చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఓ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ఆధారంగా మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చునని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆరుగురు మంత్రుల పనితీరు పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.
మంత్రివర్గంలోకి చంద్రబాబు ఓ ముస్లిం నేతను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్సీ షరీఫ్కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు కూడా బెర్త్లు ఖాయమైనట్లు ప్రచారం సాగుతోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడా చంద్రబాబు మంత్రివర్గంలో చేర్చుకోవచ్చునని అంటున్నారు.
వారితో పాటు తోట త్రిమూర్తులు, కళా వెంకటరావు, బండారు సత్యనారాయణ మూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెనాలి శ్రవణ్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కులసమీకరణలు పరిశీలించి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు.
రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి, కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చునని ప్రచారం సాగుతోంది. బిసికి, ఎస్సీకి ఒక్కటేసి మంత్రి పదవి దక్కవచ్చునని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత తన వద్ద ఉన్న విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, న్యాయ శాఖల వంటివాటిని చంద్రబాబు ఇతరులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.