నారా లోకేష్పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: ఎందుకు?
హైదరాబాద్: తన తనయుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు సంచలనానికి కూడా కారణమవుతున్నాయి. ఎందుకంటే, ఆ వ్యాఖ్యలు నారా లోకేష్ పనితీరుకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వార్తాకథనాన్ని ప్రముఖ తెలుగు దినపత్రిక గురువారంనాడు ప్రచురించింది.
లోకేశ్లో స్పీడు తగ్గిందని, ఏమైనా పనిచెబితే గతంలో స్పీడుగా చేసేవారని, ఇప్పుడు స్పీడు తగ్గిందని, రాజకీయాల్లో మనం ప్రజలకు జవాబుదారీగా వుండాలని, 80 శాతం ప్రజల్లో సంతృప్తివుండాలని చంద్రబాబు అన్నట్లు ఆ పత్రిక రాసింది. పార్టీపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఆ పత్రిక రాసింది.
పార్టీ పటిష్టంగా వుంటేనే కదా... మనం అధికారంలోకి వచ్చేదని చంద్రబాబు పలు సందర్భాలలో గుర్తుచేస్తున్నారని కూడా ఆ పత్రిక రాసింది. విజయవాడలో ఇటీవల జరిగిన క్యాబినేట్ భేటీకి ముందు చంద్రబాబు పార్టీ సయన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికలపై చర్చించారు.
ఎన్నికలను డిసెంబర్ నెలాఖరులో జరపాలని మొదట భావించారు. అయితే సంక్రాంతి పండుగ వెళ్లిన తర్వాత నిర్వహించాలని నేతలందరూ కోరారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆ తదుపరి, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చ జరిగింది. గత ఏడాది 50 రోజుల్లో 55 లక్షల సభ్యత్వం జరిగిందనీ, ఈసారి ఆ రికార్డును అధిగమించాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆ పత్రిక కథన ప్రకారం - "కొంతమంది నేతలు చంద్రబాబే అన్నీ చూసుకుంటారులే అనే భావనలో ఉన్నారు. ఆ ఆలోచన కరెక్ట్ కాదు. లోకేశ్లో కూడా స్పీడు తగ్గింది. గతంలో ఏదైనా పనిచెబితే వెంటనే చేసేవాడు. ఇప్పుడు ఆ స్పీడు తగ్గింది. స్పీడు పెరగాలి..'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"నేను నా కుమారుడినైనా లెక్కచేయను. పార్టీ విషయంలో అందరూ స్పీడుగా, ప్రజల్లోకి చొరవగా వెళ్లాల్సిందే. ప్రజల్లో 80 శాతం సంతృప్తి వచ్చేవరకు నేను ఎవరినీ వదలను. అందరినీ పరుగెత్తిస్తూనే వుంటాను'' అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఆ పత్రిక కథనం చర్చనీయాంశంగా మారింది.