నేను మూమూలు యూనివర్శిటీలో, మీరెక్కడో...: జగన్పై చంద్రబాబు విసుర్లు
ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు వైయస్ జగన్పై పలు వ్యాఖ్యలు చేశారు. తెలితేటలు ఉంటే ఏ నిబంధన కింద రాయితీలు వస్తాయనే చెప్పాలని అడిగినట్లు తెలిపారు.
గుంటూరు: "తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో నేను ఎకనమిక్స్ చదివానని, నేను మామూలు యూనివర్శిటీలో చదివానని, మీరెక్కడ చదివారో తెలియదు" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమల స్థాపనకు రాయితీలు వస్తాయని అంటున్నారని , నా కన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటే ఏ నిబంధనల కింద రాయితీలు వస్తాయో చెప్పాలని తాను అడిగానని, వారి నుంచి సమాధానం లేదని ఆయన అన్నారు.
గుంటూరు జిల్లా గొళ్లపాడులో విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశంలో శనివారం మాట్లాడారు. ఈ సమావేశంలో జగన్ పేరు ప్రస్తావించకుండా పలు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. "అసలు ఏ రూల్స్ కింద ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ వస్తాయో చెప్పండి.. వాటికోసం పోరాడుతాన"ని ఆయన అన్నారు.
తాను కేంద్రానికి భయపడుతున్నానని ప్రచారం చేస్తున్నారని, తాను భయపడే ప్రసక్తి గానీ రాజీ పడే ప్రసక్తి గానీ లేదని ఆయన చెప్పారు. తనకు ఎలా పనిచేయించుకోవాలో తెలుసునని, పని చేయించుకోవడం తన బాధ్యతగా భావించానని ఆయన అన్నారు. కేంద్రంతో ఘర్షణ పెట్టుకుంటే పోలవరం వచ్చేదా అని ఆయన అడిగారు.
తెలంగాణలో అలా... ఎపిలో ఇలా...
తెలంగాణలో జనాభా తక్కువ.... ఆదాయం ఎక్కువని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ఎక్కువ... ఆదాయం తక్కువని ఆయన అన్నారు. హైదరాబాదును తాను అభివృద్ధి చేశానని చెప్పారు. విభజన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చిన అభివృద్ధి దిశగా సాగిపోతున్నామని ఆయన చెప్పారు.
అది దేవుడిచ్చిన వరం...
గుంటూరు జిల్లాలోనే రాజధానిని నిర్మించామని, అది తనకు దేవుడిచ్చిన వరమని చంద్రబాబు అన్నారు. తనపై నమ్మకం ఉంచి రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని, మీరంతా నాపై నమ్మకం ఉంచండి, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని ఆన అన్నారు. పదేళ్లు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉంది. అక్కడే ఉండి ఏసీ గదుల్లో పరిపాలన చేసే అవకాశం ఉందని సీఎం అన్నారు. అయితే గుంటూరు నుంచే పాలన సాగిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
హోదా కోసం పట్టుబట్టాం...
ప్రత్యేక హోదా కోసం కేంద్రం ప్రభుత్వంతో పట్టుబట్టామని, ఇస్తామని చెప్పారు కాబట్టి ఇవ్వాలని పట్టుబట్టానని, 14వ ఆర్థిక సంఘంలో హోదా అంశం లేనందున ఇవ్వలేకపోతున్నామని చెప్పారని, వెనకబడిన రాష్ట్రాలకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారని, అయితే తమ పరిస్థితి వాటికన్నా భిన్నమైందని చెప్పానని, విభజన వల్ల నష్టపోయామని, తమకు ఇవ్వాల్సిందేనని అడిగానని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల ఇతర రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోలేకపోయారని చెప్పారని, అయితే తాము అలా చేయబోమని, తాము తప్పకుండా అభివృద్ధి చేసుకుంటామని చెప్పారని అన్నారు.
అలా వచ్చేది ప్రత్యేక ప్యాకేజీతో...
ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలు ప్రత్యేక ప్యాకేజీతో వస్తాయని చంద్రబాబు చెప్పారు. అది తన చొరవ వల్ల, దూరదృష్టి వల్లనే సాధ్యమైందని అన్నారు. అయితే, ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకు రాయితీలు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై చాలా మంది నమ్మకం పెట్టుకున్నారని, కొద్ది మంది రాజకీయాల్లో అటూ ఇటూ ఉన్నారని, అందరూ తనపై నమ్మకం పెట్టుకోవాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
నా ఫైల్స్ను నేనే మోసుకుని తిరిగా...
తన ఫైల్స్ తానే మోసుకుని ప్రపంచమంతా తిరిగి హైదరాబాద్ను ప్రమోట్ చేశానని చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. హైదరాబాద్కు ఎన్నో కంపెనీలను తీసుకువచ్చానని చెప్పారు. ఈ కారణంగానే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. విభజన సమయానికి 48 శాతం జనాభా ఉన్న తెలంగాణ ఆదాయం 53 శాతం ఉంటే, 58 శాతం ఉన్న ఏపీ ఆదాయం 47 శాతం మాత్రమే ఉందని ఆయన తెలిపారు.