చంద్రబాబు మంత్రివర్గ ప్రక్షాళన: పయ్యావులకు సునీత అడ్డం, మరి గాలికి..
హైదరాబాద్: దసరా పర్వదినం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇటీవల తాను చేయించిన సర్వేలో పలువురు మంత్రుల తీరు బాగాలేదని తేలింది. దీంతో ఎవరికి ఉద్వాసన జరుగుతుందోననే ఉత్కంఠ ప్రారంభమైంది.
చంద్రబాబు చేయించిన సర్వే ఆధారంగా దసరా తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఒకరిద్దరి పేర్లు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గంలో ముస్లిం సామాజిక వర్గానికి ప్రస్తుతం ప్రాతినిథ్యం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎంఎ షరీఫ్కు మంత్రివర్గంలో చోటు ఖాయం కాబోతుందని సమాచారం.
ఇక ప్రస్తుతం ఎస్టీల నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఈ కోటాలో పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ ఒక్కరే శాసనసభలో ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా గుమ్మడి సంధ్యారాణిని ఎంపిక చేశారు. వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస్ మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. సంధ్యారాణి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడంపైనే పార్టీలో అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆశీస్సులతో సంధ్యారాణికి ఎమ్మెల్సీ అవకాశం దక్కిందని అంటున్నారు. ఇప్పుడు కూడా నారాయణ అండదండలతోనే ఆమె మంత్రివర్గంలో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇటీవలె ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటుగా గాలి ముద్దు కృష్ణమ నాయుడు, పయ్యావుల కేశవ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో వీరిద్దరికీ అవకాశం లభించడం కష్టమే.
అనంతపురం నుంచి ఇప్పటికే పరిటాల సునీత మంత్రివర్గంలో ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్కు ఇది పెద్ద ఆటంకంగా మారింది. పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఓసి సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కేశవ్, దూళిపాళ్ల, సోమిరెడ్డి, ముద్దు కృష్ణమ లాంటి నేతలు మంత్రివర్గంలో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. మొత్తానికి సామాజిక కోణంలో పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల, సోమిరెడ్డి, గాలి ముద్దు కృష్ణమ లాంటి సీనియర్ నేతలను నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం చంద్రబాబుకు అంత సులభమైన విషయం కాదు.