ఢిల్లీకి బాబు, ప్రతి రాష్ట్రం నుంచి 6గురు: కెసిఆర్ సహా తెలంగాణలో అందరికీ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న రాజధాని అమరావతి వేడుకకు ఢిల్లీ పెద్దలను ఆయన ఆహ్వానించనున్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారని తెలుస్తోంది. వారిని అమరావతి వేడుకకు ఆహ్వానించనున్నారు. స్వచ్ఛ భారత్ పైన నీతి అయోగ్ నివేదికను ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పిస్తారు.
ఉత్తరాఖండ్, హర్యానా సిఎంలతో కలిసి మోడీని మూడు నలభై అయిదు నిమిషాలకు కలిసి నివేదిక ఇస్తారు. అదే సమయంలో మోడీని ఆహ్వానిస్తారు. అనంతరం అమరావతి వేడుకకు అందర్నీ ఆహ్వానించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని, ఐదున్నరకు రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు.
ప్రతి రాష్ట్రం నుంచి ఆరుగురికి ఆహ్వానం
అమరావతి శంకుస్థాపన కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అయిదు నుంచి ఆరుగురు ముఖ్యులను ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించినజాబితాను సాధారణ పరిపాలన శాఖ తయారు చేస్తోంది.
ప్రతి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయా రాష్ట్రాల ప్రతిపక్ష నాయకుడు, ఉభయ సభాపతులను అతిథులుగా ఆహ్వానించాలని నిర్ణయించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులందకీ, తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులందరికీ ఆహ్వానం పలకనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం శాసన సభ్యులందరినీ ఆహ్వానిస్తారు. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి చంద్రబాబు ఆహ్వానం పలకనున్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ను ఆహ్వానిస్తామని మంత్రి యనమల చెప్పారు.