జపాన్ ప్రధానికి చంద్రబాబు తిరుమల ప్రసాదం, ఆ శాలువాతోనే..
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. చంద్రబాబు జపాన్ ప్రధానికి శాలువా కప్పి, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. జనవరిలో భారత్ పర్యటన సందర్భంగా ఏపీకి రావాలని ఈ సందర్భంగా అబేకు చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఇరువురు పదిహేను నిమిషాల పాటు భేటీ అయ్యారు.
వారు పలు అంశాల పైన చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని తెలిపారు. కాగా, తనకు చంద్రబాబు సన్మానం చేసిన శాలువాతోనే రానున్న ఎన్నికల ప్రచారానికి వెళ్తానని షింజో అబే చెప్పారు.
అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి సహకరించాలని జపాన్ ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించామని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు అనుమతులు వేగంగా మంజూరు చేస్తామని తెలిపారు.
రాయితీలు, ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. 2029 నాటికి రాష్ట్రాన్ని భారత దేశంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తానని చెప్పిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పెట్టుబడులకు తమ రాష్ట్రం అనుకూలమైనదన్నారు.
ఉన్నత విద్యలో శక్తివంతమైన స్థానంలో ఉన్నామని తెలిపారు. బాక్సైట్, కోల్, సున్నపురాయి, కేజీ బేసిన్ సహా వివిధ రకాల సహజవనరులు ఉన్నాయని, వీటన్నింటీ నీ ఉపయోగించుకుంటే ప్రగతి పథంలో దూసుకెళ్తామన్నారు. ఆంధ్రా వర్సిటీ, నాగార్జున వర్సిటీలో జపనీష్ భాషను ప్రవేశపెడతామని సెమినార్లో చంద్రబాబు ప్రకటించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో తాము అత్యున్నత రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. వ్యవహారాల కోసమే కాకుండా పర్యావరణానికి హానీ చేయని విధంగా రాజధాని ఉంటుందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ముందుకు వచ్చిందని, జపాన్ కూడా వస్తే మంచిదన్నారు. సరైన సమయంలో నిర్మాణ పనులు చేపడతామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశముందని తెలిపారు. కృష్ణా నదికి ఇరువైపులా రాజధాని ఉంటుందన్నారు.