ఎంపీలతో బాబు భేటీ: వైసిపి ఎంపి కొత్తపల్లి గీత హాజరు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతో శనివారంనాడు సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై, అభివృద్ధిపై ఆయన వారితో చర్చించారు.
చంద్రబాబుతో సమావేశానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అసంతృప్త పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత కూడా హాజరయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టికెట్పై గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎస్పీవై ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానంతరం టిడిపి పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు.
విద్యుత్తు రంగంపై టిడిపి, బిజెపి సభ్యులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి నిధులు రాబట్టడానికి ఎంపీలంతా కృషి చేయాలని చంద్రబాబు సూచించినట్లు చెప్పారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల చొప్పున కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు 267 మంది ఎంపీలు అంగీకరించినట్లు చెప్పారు.
విభజన బిల్లులోని అంశాలన్నింటినీ నెరవేర్చాలని చంద్రబాబు ఎంపిలకు సూచించారు. రాష్ట్రానికి నిధులు, అభివృద్ధిపై చర్చించామని సుజనా చౌదరి చెప్పారు. తుఫాను నష్టంపై కేంద్రంతో ఎంపీలంతా మాట్లాడాలని, రాష్ట్రానికి నిధులు తేవడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. పార్టీ ఎంపీలంతా తప్పకుండా రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని ఆదేశించారు.
జగన్ పార్టీలో కొనసాగలేను
తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనట్లు కొత్తపల్లి గీత తెలిపారు. తాను పనిచేస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆమె మీడియాతో చెప్పారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొనసాగలేనని చెప్పారు. భవిష్యత్తులో బిజెపి, టిడిపిలతో కలిసి పనిచేస్తానని అన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సహకరించడం లేదని కొత్తపల్లి గీత విమర్శించారు.