ఎన్టీఆర్ ఉండగా రాజకీయాల్లోకి రమ్మంటే రాలేదు, ఆ తర్వాత..: చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం డాక్టర్ డీ రామానాయుడు పార్థిక దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రామానాయుడు భవిష్యత్తు తరాలకు ఆదర్శం కావాలన్నారు.
రామానాయుడి మొదటి సినిమా ఎన్టీఆర్ నటించిన రాముడు-భీముడు అని, అప్పటి నుండి ఆయన సినీ రంగంలో తిరుగులేని నిర్మాతగా ఎదిగారన్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సామాజిక కార్యక్రమాలు అనేకం చేపట్టారని కొనియాడారు.
రామానాయుడు వ్యక్తి కాదని, వ్యవస్థ అన్నారు. 13 భాషల్లో 149 చిత్రాలు తీసి చరిత్ర సృష్టించారన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఆయనను ఆహ్వానిస్తే, తనకు ఆసక్తి లేదని చెప్పారని తెలిపారు. అనంతరం తాను ముఖ్యమంత్రిగా అయ్యాక జన్మభూమికి ఇంప్రెస్ అయి టీడీపీలో చేరారని చెప్పారు.
విశాఖలోను ఓ స్టూడియోను నిర్మించి అభివృద్ధి చేయాలని భావించారని తెలిపారు. ఏ నిర్మాత కూడా ఇన్ని సినిమాలు, ఇన్ని భాషలలో తీయలేరని చెప్పారు. ఆయన సినిమాలు కూడా సందేశాన్ని ఇస్తాయని చెప్పారు. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన స్ఫూర్తి ఉంటుందని చెప్పారు.
ఆయన ఆశయాలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎంతో నిజాయితీగా సేవలు అందించారని చెప్పారు. ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శం కావాలని చెప్పారు. తుది శ్వాస వరకు సినీ రంగంలోనే పని చేశారన్నారు.