ప్యాకేజీ ఇస్తామన్నారు, చూస్తూ కూర్చోవద్దు: సుజనతో పాటు ఎంపీలకు బాబు
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పిందని, అయితే అందుకు సమానమైన నిధులు ఇస్తామని చెప్పిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు చెప్పారు. అలాగే, కాపుల అంశం పైన కూడా స్పందించారు.
కాపులకు రిజర్వేషన్ల అంశం పైన తమ ప్రభుత్వం మంజునాథ కమిషన్ వేసిందని చెప్పారు. ఈ కమిషన్ అభిప్రాయ సేకఱణ చేస్తోందన్నారు. కాపు భవన్ నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తోందన్నారు.
చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. రెండున్నర గంటల పాటు సాగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీని ప్రజలకు మరింతగా చేరువ చేసే వ్యూహాలపై చర్చించారు.
నవంబరు 1 నుంచి జన చైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్ రమణ, ముఖ్యనేతలు రేవంత్రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఏపీ సచివాలయ భవనాలను తమకు కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కోసం పోరాడాలని నేతలకు సూచించారు. దీనిపై కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పందించారు. ఇప్పటికే పోలవరం సహా వివిధ అంశాలు అమలు జరుగుతున్నాయన్నారు.
కేంద్రం అమలు చేస్తోందని మౌనంగా ఉండటం సబబు కాదని, మన ప్రయత్నం కొనసాగిద్దామని చంద్రబాబు నేతలకు సూచించారు.
మరోవైపు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉందని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన వారి వ్యాజ్యానికి కౌంటర్గా మనమూ పిటిషన్ దాఖలు చేద్దామన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై నారా లోకేశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.