నంద్యాలపై బాబు ట్విస్ట్: 'డబుల్' హామీపై శిల్ప డైలమా? అక్కడే అఖిలతో చిక్కు
నంద్యాల ఉప ఎన్నిక అంశం టిడిపిలో చర్చకు దారి తీసింది.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక అంశం టిడిపిలో చర్చకు దారి తీసింది. భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో తమ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని ఆయన కుటుంబం పట్టుపడుతుండగా, 2014లో తాను పోటీ చేశానని కాబట్టి ఇప్పుడు తమకే ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు.
శిల్పకు షాక్.. నంద్యాలను వదలం, టీవీ ఛానల్ పెడతా: మౌనిక, తెరపైకి ఆ పేరు
నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే సీటుపై బాబు హామీ
నంద్యాల శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కార్యకర్తలు, నాయకులతో రాజకీయ భవితవ్యంపై సోమవారం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు ఇచ్చిన హామీని కూడా శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. దానిపై అనుచరుల అభిప్రాయాన్ని కోరారు. ఇప్పుడు మనం టికెట్ త్యాగం చేస్తే 2019 ఎన్నికల్లో తన కుటుంబానికి నంద్యాల ఎంపీ టికెట్, శాసనసభ టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు నాయకులకు శిల్పా చెప్పారని తెలుస్తోంది.
ఏం చేద్దాం?
ఈ పరిస్థితుల్లో పార్టీలో ఉంటూ భూమా వర్గానికి మద్దతివ్వాలా? ప్రతిపక్ష పార్టీలో చేరి పోటీ చేయాలా? స్వతంత్రంగా పోటీ చేయాలా? అనే అంశాలపై చర్చించారు. ఆయన సోమవారం సాయంత్రం మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.
రాష్ట్ర మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, పురపాలక అధ్యక్షురాలు దేశం సులోచన, కో -ఆప్షన్ సభ్యులు దేశం సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
వైసిపి పోటీకి సై.. అదే కారణం
సాధారణంగా ఎవరైనా చనిపోతే అక్కడ వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పోటీ పెట్టరు. ఈ సంప్రదాయం మన వద్ద చాలా కాలంగా ఉంది. కానీ అప్పుడప్పుడు కొన్ని పార్టీలు పోటీకి దిగుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని జగన్ చెప్పారు. వైసిపి పోటీకి ఓ కారణం కూడా ఉంది.
భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి, అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. ఆ సీటు తమది కాబట్టి తాము పోటీ చేస్తామని జగన్ చెబుతున్నారు. తమ టిక్కెట్ పైన గెలిచి, భూమా పార్టీ మారారని, అలాంటప్పుడు తాము ఎలా వదులుకుంటామని వైసిపి ప్రశ్నిస్తోంది.
జగన్ తెచ్చిన చిక్కు!!
నంద్యాల ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని వైయస్ జగన్ చెప్పారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జగన్ పోటీ చేస్తామని చెప్పడంతో... తెలుగుదేశం పార్టీలో ఆశావహులు పుట్టుకు వచ్చారని అంటున్నారు. జగన్ పోటీ చేయమని చెప్పి ఉంటే కనుక.. భూమా కుటుంబానికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చేవారని, ఏకగ్రీవం అయ్యేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు టిడిపిలో రగడ ముందుకు వచ్చేది కాదని అంటున్నారు.
అఖిల ఫ్యామిలీకి ఓకే కానీ.. అక్కడే శిల్పాకు చిక్కు వచ్చి పడింది?
ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుంటే 2019లో నంద్యాల ఎంపీ, అసెంబ్లీ స్థానం ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో.. శిల్పా తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పుడు కనుక వదిలితే.. 2019లో తమ టిక్కెట్ తమకే కావాలని అఖిలప్రియ వర్గం పట్టుబట్టే అవకాశాలున్నాయి. ఈ కారణం వల్లే శిల్పా తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది.
చంద్రబాబు ప్రతిపాదనతో ఇరకాటంలో శిల్పా!
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో.. 2019పై కచ్చితమైన హామీ వస్తే.. ఈ రెండేళ్లు ఊరుకోవడం విషయం ఏమీ కాదని శిల్పా వర్గీయులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు టిక్కెట్ ఆశించిన వారు 2019లో తిరిగి మళ్లీ ఆడగరని గ్యారంటీ లేదు. ఈ కారణంతోనే చంద్రబాబు ప్రతిపాదనకు ఏం చేయాలో శిల్పాకు అర్థం కావడం లేదని అంటున్నారు.
చంద్రబాబు ప్రతిపాదన అఖిలప్రియకు తాత్కాలికంగా ఉరటనిచ్చేదే. కానీ శిల్ప ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డికి భూమా వర్గీయులుమద్దతు ఇచ్చేలా చంద్రబాబు చేశారు. దీంతో చక్రపాణి గెలిచారు. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డికి చంద్రబాబు ఇచ్చిన మరో హామీ ఫలిస్తుందా చూడాలి.