ఏపీ కోసం కేసీఆర్ వస్తానన్నారు, నీ గుండెల్లో నిద్రిస్తా: జాతీయ దళపతిగా బాబు స్పీచ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి మహానాడు వేదికగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. శుక్రవారం నాడు ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. తెలుగువారమైనప్పటికీ మొన్నటి వరకు ఒక రాష్ట్రమని, ఇప్పుడు రెండు రాష్ట్రాలన్నారు. రాష్ట్రాలు రెండు అయినా తెలుగు వారంతా ఒక్కటే అన్నారు.
రెండు రాష్ట్రాల్లో తెలుగు జాతి కలిసి అభివృద్ధి చెందాలన్నారు. తెలుగు జాతికి ప్రపంచంలో అత్యున్నత స్థాయి రావాలన్నారు. ఇవాళ ఈ గుర్తింపుకు పార్టీ కార్యకర్తలే కారణమన్నారు. మూడు రోజుల పాటు మహానాడు పండుగలా సాగిందన్నారు. ఎన్నో అంశాలపై చర్చించుకున్నామన్నారు.
ఏపీలో అధికారంలో ఉన్నాం, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం, ఢిల్లీలో సహకరించే కేంద్రం ఉందని చెప్పారు. మూడు ప్రాంతాల్లో ఏం చేయాలో చూడాల్సి ఉందన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇక్కడే రాజకీయ శిక్షణా తరగతులు పెట్టి, నైపుణ్యం పెంచామన్నారు.
టీడీపీ ఓ యూనివర్సిటీ అన్నారు. అందుకే వారి పార్టీలో నాయకులు లేకపోవడం వల్ల మన పార్టీ నుండి తీసుకున్నారని తెరాసను ఉద్దేశించి అన్నారు. ఎంతోమంది నాయకులు పుట్టారు.. చనిపోయారు.. కానీ యుగపురుషుడు మాత్రం ఎన్టీఆరే అన్నారు. ఆయన ఆశీస్సులు మనకున్నాయన్నారు.
1995లో నేను మొదటిసారి అధ్యక్షుడిని అయ్యానని, ఈ ఇరవై ఏళ్లలో ఎన్నో అవమానాలు, గౌరవాలు పొందానని చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు.
మహానాడులో రూ.12 కోట్ల విరాళం వచ్చిందని చెప్పారు. తెలుగు జాతి ఆనందంగా ఉండాలని, అందరికంటే ముందుండాలని టీడీపీ కోరుకుంటోందన్నారు. అలాగే నా కోసం జెండా మోసిన కార్యకర్తల బాగు కోరుకుంటానని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారిని, వారి పిల్లలను ఆదుకుంటున్నామని చెప్పారు.
మహానాడు తీర్మానాలపై అన్ని స్థాయిల్లో చర్చ జరగాలన్నారు. ఏడాదికి 5వేలమంది కార్యకర్తలు, వారి పిల్లలకు సహాయసహకారాలు అందిస్తామన్నారు. తాను ఈరోజు ఇంత గుర్తింపు పొందడానికి కార్యకర్తలే కారణమని కొనియాడారు. కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు.
చాలామంది టీడీపీని అంతం చేయాలనుకొని వారే అంతమయ్యారన్నారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదొల్చి, ఆ తర్వాత ఇందిరా గాంధీ క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఒక ఎమ్మెల్యే పోతే వందమంది ఎమ్మెల్యేలు తయారవుతారన్నారు.
తెలంగాణపై సవాల్ చేస్తున్నా
నేను సవాల్ చేస్తున్నానని.. 2019 టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. నాది ఉడుం పట్టు అన్నారు. పట్టిన పట్టు విడవమన్నారు. మా కార్యకర్తకు ఏమైనా జరిగితే వారి గుండెల్లో నిద్రపోతానన్నారు. మేం నీతివంతమైన పోరాటం చేస్తున్నామన్నారు. అందుకే ఎవరికీ భయపడనన్నారు.
కేసీఆర్కు ఈ చెట్లకిందే పాఠాలు చెప్పా
తెరాస అధినేత ఎక్కడి నుండో పుట్టుకు రాలేదని, ఈ చెట్లకిందే ఆయనకు పాఠాలు చెప్పానని అన్నారు. తెలంగాణలో బడుగు, బలహీనవర్గాల వారికి అండగా ఉండే పార్టీ టీడీపీ అన్నారు. తెలంగాణకు సంపద సృష్టించిన, ఆదాయం పెంచిన పార్టీ టీడీపీ అన్నారు.
హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని, తెలంగాణను మేమే చేశామని.. పార్టీల కోసమే నాయకుల కోసమో అభివృద్ధి చేయలేదని, ప్రజల కోసం చేశామన్నారు. కేసీఆర్కు భయం పట్టుకుందని, నిద్రపోయినా నిద్ర లేచినా మన పార్టీయే కనిపిస్తోందన్నారు. అందుకే మన వాళ్లకు గాలం వేస్తోందన్నారు.
సహకరించుకుందాం
రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు లేవన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకారంతో ముందుకు వెళ్లవలసి ఉందన్నారు. ఇక్కడ ఇబ్బందులు వస్తే ఏపీ సహకరిస్తుందని, ఏపీలో ఇబ్బందులు వస్తే తెలంగాణ సహకరించాలన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీకీ చరిత్ర ఉంది
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చరిత్ర ఉందన్నారు. ఓ చరిత్ర ఉన్న వర్సిటీ భూములను అమ్ముదామంటే ఎవరూ ఊరుకోరన్నారు. తెలంగాణలో తెరాస టీడీపీనే టార్గెట్ చేస్తోందన్నారు. సోనియా గాంధీ నాటకంలో.. తెలంగాణలో తెరాస, ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని లక్ష్యంగా చేసుకున్నాయన్నారు.
నీతితో, చిత్తశుద్ధితో రాజకీయం చేయాలన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేయవద్దన్నారు. మీరు బురద జల్లుతామంటే దానిని తుడుచుకునేందుకు తాము సిద్ధంగా లేమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. దేశ రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయన్నారు.
ఐదుసార్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు వస్తే నాలుగుసార్లు మనం కీలకపాత్ర పోషించామన్నారు. ఓసారి పార్లమెంటులో ప్రతిపక్షంలో ఉన్నామన్నారు. టీడీపీ ఎప్పుడు నూతన అధ్యయానికి నాంది పలుకుతుందన్నారు. దేశంలో ముప్పై ఏళ్ల తర్వాత బీజేపీకి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారన్నారు.
సాయం చేస్తామని మోడీ చెప్పారు
అవినీతి, అసమర్థ కాంగ్రెస్ పార్టీ పైన గెలిచిన మోడీ ఎన్నో మంచి పనులు చేశారని, ఇంకా చేయవలసి ఉందన్నారు. విభజన వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని, కేంద్రం సహకరించవలసి ఉందన్నారు. రాజధానికి నిధులు, ప్రత్యేక రైల్వే జోన్ తదితరాల్లో సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
కేసీఆర్కు సూచన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సమస్యలు వస్తే ఇరువురం కలిసి పరిష్కరించుకుందామని అన్నారు. పెద్దలు లేదా కేంద్రం ముందు సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. ఏపీకి సమస్యలు వస్తే నేను కూడా వస్తానని కేసీఆర్ నాడు చెప్పారన్నారు.
తీరప్రాంతం ఉంది
ఏపీని ఇండస్ట్రియల్ హబ్గా చేస్తామన్నారు. దేశంలోనే అత్యుత్తమ తీరప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
బాలకృష్ణ ఉప్పొంగిపోయారు
ఎన్టీఆర్, తెలుగు.. ఈ మాటలు వింటుంటే తన రక్తం ఉప్పొంగుతుందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తెదేపా జాతీయ పార్టీగా మారినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశమంతా కాంగ్రెస్ గాలి వీచినప్పుడు కూడా ఇక్కడ తెదేపా గెలుస్తుందని పేర్కొన్నారు.
తెదేపా భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ అంతర్జాతీయంగా పేరు తెచ్చారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినప్పుడు కూడా ఇక్కడ టీడీపీ గెలిచిందన్నారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు.
రాజకీయ గుత్తాధిపత్యాన్ని బద్ధలుగొట్టిన మహానేత ఎన్టీఆర్ అని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ప్రతి ఊరికి రోడ్డు, బడి, గుడి వచ్చాయంటే అది తెదేపా కృషి ఫలితమేనన్నారు. రాజకీయ, ఆర్థిక, విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టిన తొలినేత చంద్రబాబు అని కొనియాడారు. అధికారం అన్ని వర్గాలకు దక్కాలని చంద్రబాబు పాటు పడుతుంటారని పేర్కొన్నారు.