బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేసిన పదవి లోకేష్కు! '19 నాటికి ఫోకస్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇక తన తనయుడు, పార్టీ యువనేత నారా లోకేష్ను తెర పైకి పూర్తిగా తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రానున్న మహానాడు వేదికగా లోకేష్కు పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే పొలిట్ బ్యూరోలోకి కూడా తీసుకొవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విజయవాడలో జరగనున్న తదుపరి మహానాడు వేదిక పైన చంద్రబాబు లోకేష్ను జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు, అలాగే పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించే అవకాశముందని అంటున్నారు. లోకేష్కు జనరల్ సెక్రటరీ కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.
తెలుగు హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రం సమయంలో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనే ఒత్తిళ్లు చంద్రబాబు పైన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నారా లోకేష్కు ఆ పదవిని ఇచ్చే అవకాశముందని అంటున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పైన లోకేష్కు పూర్తి పట్టు ఉండేలా చూడాలని నేతలు, చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో లోకేష్ పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. 2019 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారానికి ఆయనను సిద్ధం చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీ బలోపేతం పైన లోకేష్ ప్రస్తుతం దృష్టి సారించారని తెలుస్తోంది. అందుకోసం ఆయన త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా మరింత మందిని టీడీపీ సభ్యులుగా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ, ఏపీల్లో కలిసి 50 లక్షలకు పైగా సభ్యులను లోకేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ నుండి ఐదు నుండి పది లక్షల మధ్య మాత్రమే సభ్యత్వం నమోదు చేయించుకున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బలోపేతం పైన లోకేష్ ప్రధానంగా దృష్టి సారించారు.
ఇటీవల లేక్ వ్యూ అతిథి గృహంలో జరిగిన ఎమ్మెల్యే, సీనియర్ నేతల సమావేశానికి లోకేష్ కూడా హాజరయ్యారు. చంద్రబాబు దారిలో లోకేష్ వెళ్తున్నారని అంటున్నారు. నాడు చంద్రబాబు టీడీపీలో చేరిన సమయంలో అతనిని జనరల్ సెక్రటరీ చేశారు. అనంతరం పార్టీ పటిష్టత పైన చంద్రబాబు అప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు.