ఇక మీరు మారరా?: ఆ జిల్లా ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన చంద్రబాబు, హెచ్చరిక
అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? మొన్ననే కదా మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడా. మళ్లీ రోడ్డెక్కి పార్టీని బజార్నపడేస్తారా.. ఇదే ధోరణి కొనసాగితే ఇక సహించేది లేదు' అంటూ ఆయన హెచ్చరించారు.
మంగళవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో క్రమశిక్షణ తప్పుతున్న ఎమ్మెల్యేలు, ముఠా తగాదాలపై చంద్రబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా కొద్దిరోజుల క్రితం అనంతపురంలో మంత్రి పరిటాల సునీత, వరదాపురం సూరి వర్గాలు రోడ్డెక్కి ఘర్షణలకు దిగిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ఎమ్మెల్యేల పనితీరుపైనా బాబు హెచ్చరించారు.
'మిమ్మల్ని, మీ పనితీరునూ గమనిస్తుంటా. నా దగ్గర అన్ని నివేదికలున్నాయి. సభలో, బయట మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారన్న దానిపై మీకు ర్యాంకులతో పాటు గిఫ్టులు కూడా ఇస్తా' అని చంద్రబాబు చెప్పారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి విజయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
'అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు, చేసిన పనులు చెప్పడం, వ్యూహాలు పన్నడంలో విజయం సాధించింది. మనం కూడా ఇక్కడ పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అయినా మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం. మనం కూడా చేసింది ప్రజలకు చెప్పాలి' అని ఎమ్మెల్యేలకు సూచించారు.
'వెలుగొండ ప్రాజెక్టును మనమే పూర్తి చేస్తాం. పోలవరం పూర్తి చేయాలని, రాష్ట్రానికి అవసరమైన తదితర అంశాలపై నిరంతరం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. సున్నిత అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించాలి' అంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.