ఫ్యాక్షన్ హత్యలకు ఆజ్యం పోసిందే వైయస్ ఫ్యామిలీ: చంద్రబాబు హెచ్చరిక
హత్య, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము పూర్తి వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు.
విజయవాడ: హత్య, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము పూర్తి వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. తప్పెవరిదైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో చోటు చేసుకున్న హత్యలు బాధాకరమని అన్నారు. ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలకు ఆజ్యం పోసిందని వైయస్ కుటుంబమే అని చంద్రబాబు ఆరోపించారు. ఎన్టీఆర్ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలతో ఇబ్బంది పడ్డారని అన్నారు.
చంద్రబాబు సోమవారం మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లా ప్రశాంతతకు మారుపేరని వ్యాఖ్యానించారు. యువ ఎమ్మెల్యేలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు.
డ్యామ్ ఎత్తు 41.15 మీటర్లు నిర్మిస్తే 2018 నాటికి కాల్వలకు నీళ్లు ఇవ్వడం సాధ్యమవుతుందని తెలిపారు. పోలవరం పనులు, నిర్వాసితుల కోసం కేంద్రం నుంచి రూ.9,500 కోట్ల నిధులు రావాల్సి ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలని ఆకాక్షించారు. మండువేసవిలోనూ కష్టపడుతున్నారని ఇంజనీరింగ్ సిబ్బందిని ప్రశంసించారు.