నియోజకవర్గాలవారీగా డేటా సేకరణ, నేతలతో ఇక తాడోపేడో బాబు షాకింగ్ నిర్ణయం
పార్టీ నిర్ణయాలు, సూచనలకు అనుగుణంగా నడుచుకోకపోయినా, ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించలేకపోయినా ఉపేక్షించేది లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులను హెచ్చరించారు.
ఒంగోలు: పార్టీ నిర్ణయాలు, సూచనలకు అనుగుణంగా నడుచుకోకపోయినా, ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించలేకపోయినా ఉపేక్షించేది లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులను హెచ్చరించారు.
ఇటీవల కాలంలో పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపట్ల చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నేతల తీరుతో పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడుతున్నారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై ఇక నుండి కఠినంగా వ్యవహరిస్తానని బాబు హెచ్చరించారు. మహనాడు వేదికపై కూడ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరిస్తున్న నేతల తీరుపై కఠిన చర్యలు తీసుకొంటామని బాబు ప్రకటించారు.
ఇక రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై ఎక్కువ సమయాన్ని కేటాయించనున్నట్టు బాబు పార్టీ నాయకులకు చెప్పారు. ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామరచర్ల జనార్థన్ సోమవారం నాడు చంద్రబాబునాయుడును కలిశారు.
నియోజకవర్గాల వారీగా సమాచార సేకరణ
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమాచారాన్ని సేకరిస్తున్నట్టు చంద్రబాబునాయుడు దామరచర్ల జనార్థన్ కు చెప్పారు. జిల్లాలోని పార్టీ పరిస్థితిని బాబుకు వివరించే ప్రయత్నం చేశారు. తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా పార్టీ నాయకులు, ఇన్ చార్జీలు, ఎమ్మెల్యేలు, జిల్లాలోని ఇతర నాయకులను పిలిపించి మాట్లాడుతానని బాబు చెప్పారు. ఒక్కొక్క నాయకుడిని విడివిడిగా పిలిచి మాట్లాడుతానని బాబు చెప్పారు.ఈ సందర్భంగా తాను తీసుకొనే నిర్ణయమే ఫైనల్ అని బాబు దామరచర్లకు వివరించారు.
గీత దాటితే వేటే
అన్ని నియోజకవర్గాల్లో సమాచారాన్ని సేకరించి ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి పలు సూచనలు చేస్తానని బాబు దామరచర్ల జనార్ధన్ కు చెప్పారు. అయితే తాను చెప్పిన సూచనలను పాటించకుండా పార్టీ నిర్ణయాలను, నిబంధనలను అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరించనున్నట్టు ప్రకటించారు. కొందరు నాయకులు పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని బాబు అభిప్రాయపడ్డారు.
రాగద్వేషాలకు అతీతంగా సమాచారమివ్వాలి
జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న నేతలు రాగద్వేషాలకు అతీతంగా సమాచారాన్ని ఇవ్వాలని బాబు పార్టీ నాయకులకు సూచించారు. రాజకీయంగా, పార్టీ పరంగా కొన్ని అంశాలను బాబు దామరచర్లకు వివరించారు. పాలనాపరంగా కొన్ని అంశాలను వారిద్దరి మద్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
పార్టీ ప్రజాప్రతినిధులతో సభలు ఏర్పాటు చేశారా?
నెలలో ఒక నియోజకవర్గంలో జిల్లా నాయకులు, ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీలు కలిసి సభ నిర్వహించాలనే విషయాన్ని సూచనను అమలుచేశారా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ నెల 23న, దర్శిలో తొలిసభ నిర్వహిస్తున్నట్టు దామరచర్ల ప్రకటించారు.
మరోసారి దామరచర్లకే జిల్లా అధ్యక్ష బాధ్యతలు
ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరోసారి దామరచర్ల జనార్ధన్ కే కేటాయించనున్నట్టు సమాచారం.ఈ మేరకు ఈ విషయాన్ని బాబు సూచనప్రాయంగా వెల్లడించారని తెలిసింది. అయితే రెండు మూడు రోజుల్లో అధికారికంగా దామరచర్ల పేరును ప్రకటించే అవకాశం ఉంది.సోమవారం నాడు దామరచర్ల చంద్రబాబునాయుడును కలవడానికి ముందుగానే ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయంలో జిల్లాకు చెందిన నేతలతో అభిప్రాయాలను సేకరించారు.