సీఎం చంద్రబాబుకు కోపం వచ్చింది, బాబుని కలిసిన రిషికేశ్వరి తల్లిదండ్రులు
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కోపం వచ్చింది. డ్వాక్రా రుణమాఫీ సంగతి ఏం చేశారంటూ తనను ప్రశ్నించిన డ్వాక్రా సంఘాల మహిళలపై చిరాకు ప్రదర్శించారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో శుక్రవాం సీఎం చంద్రబాబుని మహిళా సంఘాల ప్రతినిధులు కలిశారు.
రుణమాఫీ గురించి ప్రస్తావించగానే ఒక్కసారిగా మహిళలపై చంద్రబాబు నాయుడు అసహనంతో కాస్తంత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ మధ్యాహ్నం పలువురు డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు చంద్రబాబును కలిసిన సమయంలో ఈ ఘటన జరిగింది.
చంద్రబాబును కలిసేందుకే వచ్చిన మరికొందరు మహిళలు వినతిపత్రాలు ఇవ్వబోయినా చంద్రబాబు తీసుకోకుండా వెళ్లిపోవడం గమనార్హం. దాంతో సీఎం వ్యవహార శైలిపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. విషయం తెలిసుకున్న చంద్రబాబు, నిరసన తెలుపుతున్న మహిళల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో బాబుని కలిసిన రిషికేశ్వరి తల్లిదండ్రులు
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి తల్లిదండ్రులు శుక్రవారం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో సీఎం చంద్రబాబును కలిశారు. ఈరోజు ఉదయం మంత్రి గంటాను కలిసిన వారు ఆ తర్వాత నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు చంద్రబాబును కోరారు.