ముస్లింలకు మంత్రి పదవి కావాలి: సభ సాక్షిగా చంద్రబాబుతో జలీల్ ఖాన్
అమరావతి: ముస్లింలను అన్ని రంగాల్లో పైకి తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం విజయవాడలోని వన్టౌన్లో షాదీఖానా నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రూ. 10.50 కోట్లతో షాదీఖానా నిర్మాణం చేపడతున్నామన్నారు.
ముస్లింలలో పేదలు ఎక్కువగా ఉన్నారని చంద్రబాబు ఈ విషయాన్ని సంచార్ కమిటీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. కాబట్టి వారిని అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముస్లిం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఉర్దూ అకాడమీకి అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు.
మూరుమూల ప్రాంతంలో పుట్టి దేశ అత్యున్నత పదవిని అలంకరించిన అబ్దుల్ కలాంను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వక్ఫ్ ఆస్తులను కాపాడి, ముస్లింల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. విదేశాలకు వెళ్లే పేద ముస్లింల విద్యార్థులకు రూ.10 లక్షల సాయం చేస్తామని అన్నారు.
ఇదిలా ఉంటే షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఝలక్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన జలీల్ ఖాన్ సభ సాక్షిగా ముస్లింలకు మంత్రి పదవి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగారు.